దుస్సాహసం ప్రదర్శించేవారికి గట్టి హెచ్చరిక

రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం అన్నారు. భారత వైమానిక దళంలోకి రఫేల్‌ యుద్ధ విమానాల చేరిక కార్యక్రమంలో ఆయన ఫ్రాన్స్‌ రక్షణమంత్రి ప్లొరెన్స్‌ పార్లెతో కలిసి పాల్గొన్నారు.

Updated : 10 Sep 2020 12:56 IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం అన్నారు. భారత వైమానిక దళంలోకి రఫేల్‌ యుద్ధ విమానాల చేరిక కార్యక్రమంలో ఆయన ఫ్రాన్స్‌ రక్షణమంత్రి ప్లొరెన్స్‌ పార్లెతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హరియాణాలోని అంబాలా వైమానిక దళ కేంద్రం వేదికైంది. రఫేల్‌ విమానాలను అధికారికంగా ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టిన అనంతరం రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘రఫేల్‌ యుద్ద విమానాలరాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భవిష్యత్తులోనూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. దేశానికి రక్షణ పరంగా ఇదో చరిత్రాత్మక ఘట్టం. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్‌కు రక్షణ పరంగా రఫేల్‌ విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. దేశీయ రక్షణరంగ పరిశ్రమను ప్రోత్సహించేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ను ఆహ్వానించాం. ఇక్కడ రక్షణ రంగంలో 74శాతం ఎఫ్‌డీఐలు అనుమతించబడ్డాయి. ఈ అవకాశాన్ని ఫ్రాన్స్‌ వినియోగించుకుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

నేడు ఐఏఎఫ్‌లోకి రఫేల్‌ విమానాల చేరికతో భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి గట్టి సందేశం ఇచ్చినట్లయిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. ఇటీవల చైనా సరిహద్దు రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ఐఏఎఫ్‌ అప్రమత్తంగా వ్యవహరించిన తీరుఎంతో అభినందించదగినదని చెప్పారు. ‘‘ జాతీయ భద్రతే మాకు మొదటి ప్రాధాన్యత. భవిష్యత్తులో యుద్ధాలకు దారి తీసే పరిస్థితులు వస్తే.. వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. మా పరిధుల్లోనేకాక ఇండో-పసిఫిక్‌, హిందూమహా సముద్ర ప్రాంతంలోనూ శాంతికి కట్టుబడి ఉన్నాం. ఆ ప్రాంతాల్లో మా పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల ప్రధాన అజెండా. ఉగ్రవాదం నుంచి ముప్పును ఏ మాత్రం విస్మరించేది లేదు’’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

ఐఏఎఫ్‌ చీఫ్‌ ఆర్కేఎస్‌ బదౌరియా మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ఇవి దళంలోకి రావడం మంచి విషయం. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ విమానాలు పరిస్థితులను అదుపులోకి తేగలవు’అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ నేను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నానని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లె అన్నారు. ‘భారత్‌, ఫ్రాన్స్‌కు ఇదో గొప్ప విజయం. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాల్ని సూచిస్తున్నాయి. భారత దేశానికి ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.’ అని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని