రికవరీ భారత్‌: 50లక్షల మంది డిశ్చార్జ్‌!

దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షల 74వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 50లక్షల 16వేల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated : 28 Sep 2020 10:17 IST

24గంటల్లో 82వేల కేసులు, 1039 మరణాలు!
దేశవ్యాప్తంగా 60లక్షలు దాటిన కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్యం దాదాపు 85వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతుండగా కోలుకుంటున్న వారిసంఖ్య కూడా 70వేలకుపైనే ఉంటోంది. తాజాగా నిన్న 7,09,394 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 82,170 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షల 74వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 50లక్షల 16వేల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 75వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేవలం గత 11రోజుల్లోనే 10లక్షల మంది కోలుకున్నారు. ఒక్కోసారి రోజువారీ పాజిటివ్‌ కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు ఐదుసార్లు రికవరీ సంఖ్య అధికంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 62వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 82.58శాతంగా ఉంది.

ఇక కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం దాదాపు వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మరో 1039మంది కరోనా రోగులు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 95,542కు చేరింది. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే నిత్యం 400లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ 35వేల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 9వేల మంది ప్రాణాలు కోల్పోగా కర్ణాటకలో 8500మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.57శాతంగా ఉంది.

12రోజుల్లో 10లక్షల కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 10రాష్ట్రాల్లోనే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. గడిచిన 12రోజుల్లోనే 10లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్‌ కేసులు బయటపడుతోన్న తీరు ఇలా..

1 నుంచి 10లక్షలకు 168 రోజులు
10 నుంచి 20 లక్షలు - 21 రోజులు
20 నుంచి 30 లక్షలు - 16 రోజులు
30 నుంచి 40 లక్షలు - 13 రోజులు
40 నుంచి 50 లక్షలు - 11 రోజులు
50 నుంచి 60లక్షలు - 12 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా వీరిలో ఇప్పటికే 50లక్షల మంది కోలుకున్నారు. దేశంలో వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య ఇలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని