కొవిడ్‌ టెస్ట్‌: లాలాజల పరీక్షలతో వేగంగా..!

లాలాజలంతో చేసే పరీక్షల్లో లక్షణాలు లేనివారిలోనూ వైరస్‌ను తేలికగా గుర్తించవచ్చని పరిశోధకులు తేల్చారు.

Published : 29 Sep 2020 16:25 IST

మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయంటున్న జపాన్‌ పరిశోధకులు

టోక్యో: కొవిడ్-19 మహమ్మారిని కచ్చితంగా సులువుగా, త్వరితంగా నిర్ధారించే  పరీక్షల కోసం ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా లాలాజలంతో చేసే పరీక్షల్లో లక్షణాలు లేనివారిలోనూ వైరస్‌ను తేలికగా గుర్తించవచ్చని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా స్వాబ్‌ పరీక్షల్లో వస్తున్నట్లే లాలాజల పరీక్షల్లోనూ కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. లక్షణాలు కనిపించని దాదాపు 2వేల మందిపై ఈ విధానంలో పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదిక ఒక వైద్య జర్నల్‌లో ప్రచురితమైంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కువమంది కేవలం లక్షణాలు ఉన్నవారు, లేదా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగినవారే కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, లక్షణాలు కనిపించని వారిలోనే ఎక్కువగా కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించే పనిలో భాగంగా తాజా విధానాన్ని రూపొందించామని జపాన్‌లోని హొక్కైడో యూనివర్సిటీకి చెందిన టకనోరీ టెషిమా తెలిపారు. దీనికోసం సేకరించిన నమూనాలను పీసీఆర్‌ పరీక్షతోపాటు అరుదుగా ఉపయోగించే ఆర్‌టీ-ల్యాంప్‌(RT-LAMP) విధానంలో పరీక్షించారు.

స్వాబ్‌ ద్వారా తీసుకున్న శాంపిళ్లలో 77 నుంచి 93శాతం వైరస్‌ను గుర్తించగా, లాలాజలం శాంపిళ్లలో 83-97శాతం వైరస్‌ను గుర్తిస్తున్నట్లు కనుగొన్నారు. రెండు విధానాల్లో చేసిన అన్ని శాంపిళ్లలో దాదాపు ఒకేవిధమైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ రెండు విధానాల్లో వైరస్‌ సోకని వారిని 99.9శాతం కచ్చితత్వంగా గుర్తించగలుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే, గొంతు, ముక్కు ద్వారా నమూనాలను సేకరించే విధానం కన్నా లాలాజలం ద్వారా సులువుగా నమూనాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలా సులువైన, చౌకైన విధానం. అంతేకాకుండా వీటిని సేకరించే వారికి వైరస్‌ బారినపడే ప్రమాదం కూడా ఉండదని స్పష్టంచేస్తున్నారు. అయితే, పీసీఆర్ పరీక్షతో పోలిస్తే వీటి కచ్చితత్వం కాస్త తక్కువే అయినప్పటికీ.. ఫలితం తొందరగా అవసరమయ్యే క్రీడా వేదికలు, విమానాశ్రయాల్లో కొవిడ్‌ నిర్ధారణకు ప్రత్యామ్నాయంగా ఈ లాలాజల పరీక్షలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు.

ఇప్పటికే లాలాజల ఆధారిత నిర్ధారణ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. కరోనా నిర్ధారణకు అవసరమైన రీఏజెంట్లు, ఇతర ఉపకరణాల కొరతను ఈ పరీక్ష విధానంతో అధిగమించవచ్చని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ మధ్యే అందుబాటులోకి వచ్చిన ‘సలైవా డైరెక్ట్‌’ విధానంలో.. వ్యాధి లక్షణాలు లేనివారిలో కరోనాను గుర్తించవచ్చని తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని