ఇది ఫలిస్తే ఆఫీసుల్లో వైరస్‌ను కట్టిపడేయొచ్చు!

ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. మహమ్మారిని నిలువరించాలంటే ముందుగా దాన్ని గుర్తించడం అత్యంత కీలకం. .................

Updated : 26 Sep 2020 12:34 IST

లాలాజలం ద్వారా వైరస్‌ నిర్ధారణ.. ప్రారంభమైన పైలట్‌ ప్రోగ్రాం

మెల్‌బోర్న్‌: ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. మహమ్మారిని నిలువరించాలంటే ముందుగా దాన్ని గుర్తించడం అత్యంత కీలకం. ఎంత వేగంగా, కచ్చితత్వంతో గుర్తించగలిగితే అంతే వేగంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలం. వైరస్‌ సోకిందో.. లేదో.. నిర్ధారించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘స్వాబ్‌ టెస్టింగ్‌’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో గొంతు లేదా ముక్కు లోపలి భాగం నుంచి నమూనాల్ని సేకరించి పరీక్షిస్తారు. ఈ ప్రక్రియలో ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరీక్షా విధానాలపై దృష్టి సారించారు. అందులో ఒకటి లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్ధారించడం. ఇప్పటికే ఈ విధానం సత్ఫలితాలిస్తున్నట్లు అమెరికన్‌ ఎఫ్‌డీఐ ధ్రువీకరించింది. అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసింది. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని అవలంబించేందుకు అంగీకరించింది.

పని ప్రదేశాల్లో దీని సామర్థ్యం...

తాజాగా పనిప్రదేశాల్లో లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్ధారించే ప్రక్రియపై కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో పైలట్‌ ప్రోగ్రాం ప్రారంభమైంది. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న పనిప్రదేశాల్లో తరచూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ స్వాబ్‌ టెస్టింగ్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎక్కవ సమయం పడుతుంది. దీంతో వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో లాలాజలం పద్ధతి అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్థారించే విధానంతో నిరంతరం పరీక్షలు నిర్వహించడం.. పనిప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఈ విధానానికి ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడమే లక్ష్యంగా విక్టోరియాలో పైలట్‌ ప్రోగ్రాం ప్రారంభమైంది. డోహర్టీ ఇన్‌స్టిట్యూట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌, రాయల్‌ మెల్‌బోర్న్‌ హాస్పిటల్‌, విక్టోరియా ప్రభుత్వం కలిపి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 

నమూనాలు ఎలా సేకరించడం..

పైలట్‌ ప్రోగ్రాంలో భాగంగా లాలాజలాన్ని సేకరించేందుకు మూడు పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. వీటిలో పనిప్రదేశాల్లో ఏ విధానం సమర్థంగా ఉంటుందో నిర్ధారించనున్నారు. అందులో ఒకటి నేరుగా నోటి నుంచి లాలాజలాన్ని పరీక్షా పాత్రలోకి తీసుకోవడం.. రెండోది స్వాబ్‌ ద్వారా నాలుక కింద నుంచి నమూనాల్ని సేకరించడం. ఇక మూడో పద్ధతిలో నోటి నుంచి స్ట్రాలోకి అక్కడి నుంచి టెస్టింగ్‌ ట్యూబ్‌లోకి తీసుకోవడం. ప్రస్తుతం విక్టోరియా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న వెయ్యి మంది పోలీసు అధికారుల నుంచి ఈ విధానంలో నమూనాల్ని సేకరిస్తున్నారు.

ముప్పు ప్రాంతాల్లో ఓ నిఘా విధానం.. 

వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్ధారించే పద్ధతి సత్ఫలితాలిస్తుందని తాను భావిస్తున్నట్లు ఈ పైలట్‌ ప్రోగ్రాంకు నేతృత్వం వహిస్తున్న డోహర్టీ ఇన్‌స్టిట్యూట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మైక్‌ క్యాటన్‌ అభిప్రాయపడ్డారు. లాలాజలం విధానం సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరుగుతున్నట్లు తెలిపారు. కరోనా నిర్ధారణకు స్వాబ్‌ టెస్టింగ్‌ అత్యంత ప్రామాణికమైనప్పటికీ.. లాలాజలం పద్ధతి ఒక మేలిమి ప్రత్యామ్నాయంగా మారుతుందన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది తిరిగే పనిప్రదేశాల్లో వైరస్‌ కట్టడికి ఇది ఒక నిఘా విధానంగా పనిచేస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు