‘ఆ నిర్ణయం పాక్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది’

ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పవార్‌ మంగళవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో సమావేశమయ్యారు.

Published : 15 Sep 2020 21:55 IST

ముంబయి: ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పవార్‌ మంగళవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో సమావేశమయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని గోయెల్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పవార్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లి ఎగుమతుల విషయంలో భారత్‌కు విశ్వసనీయ సరఫరాదారుగా మంచి పేరుంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఆ పేరు దెబ్బతినడమే కాకుండా.. పరోక్షంగా పాకిస్థాన్‌ సహా ఇతర దేశాలకు ప్రయోజనకరంగా మారుతుంది. ఈ విషయంపై మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల నుంచి నాకు వినతులు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయంపై పునరాలోచించాలని వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయెల్‌ను కోరాను. దానిపై గోయెల్‌ సానుకూలంగా స్పందించారు. వాణిజ్య, ఆర్థిక, వినియోగదారుల శాఖలతో కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామన్నారు’అని పవార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో ఉల్లిపా లభ్యత, ధరలను అరికట్టేందుకు కేంద్రం ఎగుమతులను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని