రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు

అయోధ్యలో రామమందిరం భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిరం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా..

Published : 20 Jul 2020 20:04 IST

ఆలయ నిర్మాణానికి భారీ ఏర్పాట్లు

300 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపిన పూజారులు

దిల్లీ: అయోధ్యలో రామమందిరం భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిరం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌కు కూడా రామమందిరం పూజారులు ఆహ్వానం పంపారు. కాగా దాదాపు 300 మందికి ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది. 

రామమందిరం నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఆగస్టు 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించేందుకు పూజారులు నిర్ణయించారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ 12.15 గంటలకు భూమిపూజ జరుపనున్నారు. రామమందిరంతోపాటు అయోధ్యలో ప్రధాని మోదీ మొదటి పర్యటన ఇదే కానుంది. భూమిపూజ సందర్భంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలను అమర్చనున్నారు. ఇందులో మొదటి ఇటుకను ప్రధాని అమర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఐదు ఇటుకలు ఐదు గ్రహాలకు ప్రతీక. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతిపాదించిన మాదిరిగానే ఆలయ రూపకల్పనతోపాటు నిర్మాణం ఉండనుంది. అయితే మునుపటి డిజైన్‌తో పోలిస్తే గుడి పొడవు, వెడల్పుతోపాటు ఎత్తును పెంచనున్నారు. గతంలో ప్రతిపాదించిన 38 వేల చదరపు అడుగుల వైశాల్యానికి బదులు 76 వేల నుంచి 84 వేల చదరపు అడుగుల మధ్య నిర్మించనున్నారు. 

శివసేనకు రామమందిరం ఉద్యమంతో దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. అందుకే భూమిపూజకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మందిరం కూల్చివేత కేసులో మొదట ఉద్దవ్ తండ్రి బాలసాహెబ్ ఠాక్రే పేరు చేర్చారు. కానీ బాల్‌ ఠాక్రే మరణం అనంతరం అతడి పేరును తొలగించారు. ఈ ఏడాది మార్చిలో ఉద్ధవ్‌ అయోధ్యలో పర్యటించి రామమందిరం నిర్మాణాలనికి రూ.కోటి విరాళం ప్రకటించారు. భాజపాతో సంబంధాలు తెంచుకున్నప్పటికీ తన పార్టీ శివసేన హిందుత్వానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని