స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ఆర్య సమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇన్‌స్టిట్యూట్‌.....

Published : 12 Sep 2020 01:36 IST

దిల్లీ: ఆర్య సమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిల్లరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌)లో చేరారు. నాలుగురోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

1939 సెప్టెంబర్‌ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్‌ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే  రాజకీయ పార్టీని స్థాపించి, 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్​అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు (2004-2014) కొనసాగారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని