భారత్‌, చైనాలోనే స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి!

రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ఉత్పత్తి భారత్, చైనా దేశాల్లోనే జరుగనుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టంచేశారు.

Published : 17 Nov 2020 21:33 IST

వెల్లడించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

మాస్కో: రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ఉత్పత్తి భారత్, చైనా దేశాల్లోనే జరుగనుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టంచేశారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే టీకా అభివృద్ధి కోసం బ్రిక్స్‌ దేశాలు సంయుక్తంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా నిర్దేశించుకున్న విధంగా బ్రిక్స్‌ దేశాల టీకాల పరిశోధనాభివృద్ధి కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. దక్షిణాఫ్రికా చొరవతో రెండేళ్ల క్రితమే ఈ కేంద్రం ఏర్పాటుకు బ్రిక్స్‌ దేశాలు అంగీకరించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సులో పుతిన్‌ మాట్లాడారు.

‘ఇప్పటికే స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం బ్రెజిల్‌, భారత్‌తో రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై భారత్‌, చైనాలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇవి కేవలం ఆయా దేశ అవసరాలకే కాకుండా ఇతర దేశాల సరఫరాకు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన జరిగిన 12వ బ్రిక్స్‌ సదస్సులో భాగస్వామ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

ఇదిలాఉంటే, మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్‌ రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఆగస్టు నెలలో పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేయడంతో పాటు స్థిరమైన వ్యాధి నిరోధకత కలిగి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన కుతుళ్లలో ఒకరు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నారని, ఆమె బాగానే ఉందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్‌ కూడా దాదాపు 92శాతం సమర్థతను కలిగిఉన్నట్లు మధ్యంతర ఫలితాల్లో వెల్లడైన విషయాన్ని తాజాగా రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక భారత్‌లోనూ స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని