
పిజ్జా తింటే వార్తగా నిలుస్తుందా?
దిల్లీ ప్రదర్శనకారులకు వెల్లువెత్తిన మద్దతు
ఇంటర్నెట్ డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులు దిల్లీ శివార్లలో నిరవధిక నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఆందోళన గత 19 రోజులుగా కొనసాగుతోంది. అతి శీతల వాతావరణంలో బహిరంగ నిరసనలో పాల్గొంటున్న వీరికి పలువురు సహాయంగా నిలుస్తున్నారు. వీరికి అవసరమైన ఏర్పాట్లను, వస్తువులను అందచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దాతలు రైతులకు పిజ్జాలను పంచారు. అయితే రైతులు పిజ్జా తినటంపై కొంతమంది విమర్శలు చేశారు. ఈ వైఖరిపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, గాయకుడు దిల్జీజ్ దొసాంజ్ రైతులకు మద్దతు పలికారు. ‘‘వ్యవసాయదారులు విషం తింటే ఎవరికీ ఆందోళన లేదు.. కానీ వారు పిజ్జా తింటే అది వార్తగా నిలుస్తుంది!’’ అని ఉన్న ఓ చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు.
పిజ్జాకు గోధుమలు అందించేది వారే..
షాన్బీర్ సింగ్ సంధూ అనే యువకుడు, నలుగురు స్నేహితులతో కలిసి గతవారం ‘పిజ్జా లంగర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 400కు పైగా పిజ్జాలను నిరసన కారులకు అందచేశారు. రైతుల కోసం పప్పు, చపాతీలతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేసేందుకు చాలినంత సమయం లేకపోవటంతో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. పిజ్జా తయారీకి కావాల్సిన గోధుమలను అందించే రైతులు.. పిజ్జాను ఎందుకు తినకూడదంటూ షాన్బీర్ సింగ్ ప్రశ్నించారు. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న తాను కూడా వ్యవసాయదారుడినే అని ఆయన తెలిపారు.
వెల్లువెత్తుతున్న మద్దతు
తాము మరోసారి మరింత పెద్ద అన్నదాన లంగర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆ యువకులు ప్రకటించారు. ఈసారి దానిలో పిజ్జా, బర్గర్ లాంటివి మరెన్నో పంచిపెడతామని వారు వివరించారు. నిరసన చేస్తున్న వేలాది రైతులకు సహాయం చేసేందుకు భారీగా దాతలు ముందుకొస్తున్నారు. వారికి ఆహారం, నిద్రపోయేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గంటలో 1500 నుంచి 2000 చపాతీలను తయారు చేయగల యంత్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ‘ఖల్సా ఎయిడ్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారికోసం కాళ్లను మర్దన చేసే (ఫుట్ మాసేజ్) యంత్రాలను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.