జనవరి 7వరకు బ్రిటన్‌కు విమానాలు బంద్‌

బ్రిటన్‌లో కరోనా కొత్తరకం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరికొంత కాలం పొడగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను

Updated : 30 Dec 2020 16:11 IST

దిల్లీ: బ్రిటన్‌లో కరోనా కొత్తరకం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరికొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ బుధవారం వెల్లడించారు. ఆ తర్వాత కఠిన ఆంక్షల నడుమ సేవల పునరుద్ధరణ ఉంటుందని, దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని కేంద్రమంత్రి ట్విటర్‌లో తెలిపారు. 

కొత్త రకం వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్-బ్రిటన్‌ మధ్య ఈ నెల 23 నుంచి 31 వరకు విమాన సేవలను కేంద్రం తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల భారత్‌ తిరిగివచ్చిన వారిలో పలువురికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తేలడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. విమాన సర్వీసులను నిషేధాన్ని మరింతకాలం పొడిగించింది. మరోవైపు దేశంలో కొత్త రకం వైరస్‌ను పసిగట్టి, వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ నెల 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చి, కరోనా పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనుంది. మిగతావారికి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, కొద్దిరోజుల పాటు వారిని పర్యవేక్షించనుంది.

కాగా.. దేశంలో కొత్త రకం కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 20 మందికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తేలింది. దీంతో వీరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ కేసులు నమోదయ్యాయి. 

ఇవీ చదవండి..

దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు

ఎర్రకోటలో గణతంత్ర వేడుకలు లేనట్లేనా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని