US Military: సుదీర్ఘ యుద్ధం.. భారీ మూల్యం

అఫ్గాన్‌లో అమెరికా శకం ముగిసింది. అగ్రరాజ్య సైనికులను ఎక్కించుకున్న చివరి విమానం... కాబుల్‌ విమానాశ్రయాన్ని వీడి వెళ్లిపోయింది. 9/11 దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు

Updated : 01 Sep 2021 13:18 IST

అఫ్గాన్‌లో 2 దశాబ్దాల్లో వేల మరణాలు

ఖర్చుల కోసం భారీగా అప్పులు చేసిన అగ్రరాజ్యం
భావితరాలకు తప్పని భారం

వాషింగ్టన్‌: అఫ్గాన్‌లో అమెరికా శకం ముగిసింది. అగ్రరాజ్య సైనికులను ఎక్కించుకున్న చివరి విమానం... కాబుల్‌ విమానాశ్రయాన్ని వీడి వెళ్లిపోయింది. 9/11 దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టిన అమెరికా.. నాటి తాలిబన్‌ పాలనకు తెరదించి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. విచిత్రం! అదే అగ్రరాజ్యం అఫ్గాన్‌ను వీడి వెళ్లే సమయానికి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకోగా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాధినేత పలాయనం చిత్తగించారు. గత 20 ఏళ్లలో అఫ్గాన్‌ కొంత అభివృద్ధి చెందినా, అక్కడి పరిస్థితులు మాత్రం అగ్రరాజ్యానికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. అమెరికా పౌరులు, సైనికులు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌లో కార్యకలాపాల కోసం అగ్రరాజ్యం అప్పులు తెచ్చి, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రస్తుతం అమెరికాలోని ప్రతి నలుగురిలో ఒకరు 9/11 దాడుల తర్వాత పుట్టినవారే. వీరంతా ఈ రుణ భారాన్ని మోయక తప్పదు! 

20 ఏళ్లలో అఫ్గాన్‌ సాధించిన వృద్ధి
- శిశు మరణాల రేటు 50 శాతానికి పైగా తగ్గింది. 
- బాలికల్లో విద్యావంతుల సంఖ్య 37% పెరిగింది.
- 2001 నాటికి విద్యుత్తు సదుపాయమున్న అఫ్గానీలు 22% మాత్రమే కాగా, 2019 నాటికి అది 98 శాతానికి చేరింది.

అమెరికా కాంగ్రెస్‌ విశ్లేషణ...
9/11 దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా పార్లమెంటు 2001, సెప్టెంబరు 18న నిర్ణయించింది. అఫ్గాన్‌పై యుద్ధం ప్రకటించింది. వియత్నాం యుద్ధ వ్యయం పై యూఎస్‌ సెనేట్‌ రక్షణ కేటాయింపుల ఉపసంఘం 42 సార్లు ప్రస్తావించింది. అదే ఉపసంఘం... అఫ్గాన్‌-ఇరాక్‌ యుద్ధ వ్యయంపై మాత్రం కేవలం 5 సందర్భాల్లోనే చర్చించింది. 2001, సెప్టెంబరు 11 నుంచి అఫ్గాన్, ఇరాక్‌ యుద్ధం నిమిత్తం చేసిన ఖర్చుల గురించి సెనేట్‌ ఆర్థిక కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించింది.

పన్నుల రూపంలో...
యుద్ధాన్ని కొనసాగించాలంటే నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తూ ఉండాలి. ఇందుకు అమెరికా అధ్యక్షులు తమ ప్రజలపై తాత్కాలికంగా పన్నుల భారం మోపారు. కొరియా యుద్ధం కోసం నాటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ 92%, వియత్నాం యుద్ధం కోసం అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ 77% మేర పన్నులను పెంచారు. మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పైగా, ధనికులు చెల్లించే పన్నుల్లో 8% కోత విధించారు!

అప్పులు తడిసి మోపెడు... 
- అఫ్గానిస్థాన్, ఇరాక్‌లలో సేవలందించిన 40 లక్షల మంది ఆరోగ్యం, ఇతర సదుపాయాల కోసం అమెరికా సుమారు రూ.146 లక్షల కోట్లు (2 ట్రిలియన్‌ డాలర్లు) ఖర్చు చేయనుంది.
- 2020 నాటికి అఫ్గాన్‌-ఇరాక్‌ యుద్ధం కోసం అప్పు రూపంలో రూ.146 లక్షల కోట్లు సమకూర్చింది.
- 2050 నాటికి వడ్డీతో సహా కట్టాల్సిన సొమ్ము రూ.474.30 లక్షల కోట్లు (6.5 ట్రిలియన్‌ డాలర్లు) కానుంది.

హార్వర్డ్, బ్రౌన్‌ విశ్వవిద్యాలయాలు చేపట్టిన ‘కాస్ట్‌ ఆఫ్‌ వార్‌’ ప్రాజెక్టు వివరాల ప్రకారం..
అఫ్గాన్‌లో మరణించిన వారి సంఖ్య (ఏప్రిల్‌ నాటికి)
అఫ్గాన్‌ ప్రభుత్వ సైనికులు, పోలీసులు: 66,000
తాలిబన్లు, ఇతర ఫైటర్లు: 51,191
అఫ్గాన్‌ ప్రజలు: 47,245
అమెరికా కాంట్రాక్టర్లు: 3,846
అమెరికా సైనికులు: 2,461
నాటో, మిత్రదేశాల సైనికులు: 1,144
సహాయకులు: 444
జర్నలిస్టులు: 72 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు