Maharashtra Rains: రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడి.. 36 మంది మృతి

భారీ వర్షాలు, వరదలతో తీర రాష్ట్రం మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌ సహా పలు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి.

Updated : 23 Jul 2021 16:12 IST

ముంబయి: భారీ వర్షాలు, వరదలతో తీర రాష్ట్రం మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌ సహా పలు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రాయ్‌గఢ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రాయ్‌గఢ్‌లోని మహద్‌తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇల్లు ధ్వంసమై పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 32 మంది మరణించినట్లు రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ తెలిపారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబయి- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షాల ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని