బైడెన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు.. ఎవరికంటే..

ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి కూడా సవాలుగా నిలిచిందని జో బైడెన్‌ అన్నారు.

Updated : 26 Nov 2020 11:31 IST

 ‘థ్యాంక్స్‌గివింగ్‌’ సందర్భంగా కాబోయే అధ్యక్షుడి ప్రసంగం

వాషింగ్టన్‌: ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు. కరోనా వైరస్‌ కమ్ముకున్న సమయంలో కూడా రికార్డు సంఖ్యలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని అమెరికా ప్రజలు తీర్పును వెలువరించారన్నారు. బుధవారం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఇచ్చిన ‘థ్యాంక్స్‌గివింగ్‌’ ప్రసంగంలో బైడెన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రరాజ్యంలో ప్రతి సంవత్సరం నవంబర్‌లో జరుపుకునే ఈ థ్యాంక్స్‌గివింగ్ కార్యక్రమంలో.. ప్రజలకు, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేయటం సంప్రదాయం. కాగా, కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ వీటన్నిటికీ తోడు ఈసారి ప్రజాస్వామ్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.

ప్రజాస్వామ్యమే అమెరికా హృదయ స్పందన అని బైడెన్‌ ఈ సందర్భంగా అన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రజలను అనేక పరీక్షలకు గురిచేసిందని.. 2 లక్షల 60 వేల మంది అమెరికన్లను బలితీసుకుందన్నారు. ఈ ఏడాది ఎంతో బాధకు, నష్టానికి, ఆవేదనకు కారణమైందని.. మనను విడదీయాలని చూసిందన్నారు. అయితే, అమెరికా ప్రజలు ఇందుకు దీటుగా నిలబడ్డారని బైడెన్‌ అన్నారు. నిన్నటి కంటే ఈ రోజు బాగుంటుందని, ఇక రేపు అనే రోజు మరింత బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ప్రజాస్వామ్యానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. అయితే యుద్ధం చేయాల్సింది కొవిడ్‌-19తో కానీ, మనలో మనం కాదన్నారు. బలమైన సంకల్పంతో ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, కర్తవ్యం పట్ల పునరంకితం కావాలని జో బైడెన్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని