కొవిడ్‌ వ్యాక్సిన్‌ కీలక ప్రయోగాల్లో భాగమవుతారా?

‘కోవాగ్జిన్‌’ మూడో దశ మానవ ప్రయోగాలను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు.

Published : 26 Oct 2020 15:16 IST

భువనేశ్వర్‌లో కోవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించిన అధికారిక సంస్థ

భువనేశ్వర్‌: కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్‌ బయోటెక్‌లు దేశీయంగా టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘కోవాగ్జిన్‌’ టీకా మూడవ దశ మానవ ప్రయోగాలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేపట్టనున్నారు. కాగా వీటిలో వాలంటీర్లుగా పాల్గొనే ఆసక్తి ఉన్నవారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి అనువైన వ్యాక్సిన్‌ ఎంపిక తుది దశకు చేరుకున్నట్టే అని.. హ్యుమన్‌ ట్రయల్స్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ ఈ. వెంకటరావు అభిప్రాయపడ్డారు. ఈయన నగరంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ ఎస్‌యూఎం’ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. మూడో దశ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరిపేందుకు ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన 21 వైద్య సంస్థల్లో ఇది ఒకటి కావటం గమనార్హం.

ప్రయోగాలు సాగేదిలా..

కోవాగ్జిన్‌ తొలి, రెండవ విడత ప్రయోగాలు సంతృప్తికరంగా పూర్తయ్యాయని.. కీలకమైన మూడోదశ ప్రయోగాలలో వేలాది వాలంటీర్లు పాల్గోనున్నారని డాక్టర్‌ రావు తెలిపారు. హ్యుమన్‌ ట్రయల్స్‌లో వైద్యసేవల సిబ్బంది కూడా పాల్గొంటారని ఈ సీనియర్‌ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ క్రమంలో సగం మంది వాలంటీర్లకు ప్లాసిబోను.. మిగిలిన సగం మందికి కోవాక్జిన్‌ను ఇచ్చి పరీక్షిస్తామని ఆయన వివరించారు. ఈ విధంగా కరోనా నిరోధకతపై ఈ వ్యాక్సిన్‌ పనితీరును క్షణ్ణంగా పరిశీలిస్తామన్నారు.ఇప్పటి వరకు ఉన్న వయోపరిమితి తదితర అర్హతా ప్రమాణాలను సడలించి. ఆరోగ్యంగా ఉన్న వారిపై కూడా వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిర్వహించనున్నామని డాక్టర్‌ వెంకటరావు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాల్లో భాగమయ్యేందుకు భారీగా ప్రజలు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు. అయితే 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులపైన మాత్రమే మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు www.ptctu.soa.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సమాచారమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని