మరో లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్‌?

బ్రిటన్‌ మరోమారు లాక్‌డౌన్‌ విదిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Published : 31 Dec 2020 01:37 IST

లండన్‌: కొత్త రకం కరోనా వైరస్‌ కేసులు ఉధృతమౌతున్న నేపథ్యంలో బ్రిటన్‌ మరోమారు లాక్‌డౌన్‌ విధిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. కరోనా బారినపడి ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉండటంతో అక్కడి వైద్యారోగ్య, అంబులెన్స్‌ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దేశంలో పూర్తి మూసివేత చర్యలు చేపడితే తప్ప.. ఇక్కడ సంభవించనున్న లక్షలాది కొవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేయలేమని నిపుణులు స్పష్టం చేశారు. వైద్యారోగ్య సిబ్బంది కూడా నాలుగో దఫా లాక్‌డౌన్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితిని గురించి బ్రిటన్‌ ప్రభుత్వం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది.

ఈ నెల 28న ఒక్కరోజే బ్రిటన్‌ ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 20,426గా నమోదైంది. ఈ సంఖ్య కొవిడ్‌ తొలిదశలో నమోదైన అత్యధిక సంఖ్యను దాటేసిందని గణాంకాలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో ఈ దేశంలో వైద్య, అంబులెన్స్‌ సేవలు కుదేలౌతున్నాయి. ఇదిలా ఉండగా యూకేలో మంగళవారం నమోదైన 53,135 కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇంగ్లండులో గత వారం కొవిడ్‌ కేసుల సరాసరి లక్ష మందికి 807.6గా వెల్లడైంది. ఇది జాతీయ సరాసరి కంటే రెట్టింపు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇక్కడి ఎస్సెక్స్‌ వంటి ప్రాంతాల్లో ఐతే అదే కాల వ్యవధిలో లక్ష జనాభాకు ఏకంగా 1300 పైగా కేసులు నమోదయ్యాయి.

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, కొద్ది వారాల్లోనే జాతీయ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా జరగకుండా నిరోధించేందుకు సత్వర లాక్‌డౌన్‌ అమలే పరిష్కారమని ప్రభుత్వానికి వైద్య సలహాలనిచ్చే ఇండిపెండెంట్‌ బృందం సూచించింది. నాలుగో దఫా లాక్‌డౌన్‌ కనీసం ఒక నెల పాటు కొనసాగాలని.. ఈ సమయంలో విద్యాసంస్థల మూసివేతతో పాటు, బ్రిటన్‌కు రాకపోకలపై కూడా ఆంక్షలు విధించాలని  ప్రభుత్వానికి వైద్య సలహాలనిచ్చే ఈ వైద్య బృందం వివరించింది. కాగా లండన్‌, కెంట్‌తో సహా ఇంగ్లండులోని పలు ప్రాంతాల్లో గత పది రోజులుగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. కొవిడ్‌ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కరోనా పరిస్థితిని సత్వరమే అదుపులోకి తెచ్చి, కేసుల సంఖ్యను తగ్గించకుంటే.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఫలితం ఉండకపోవచ్చని కొవిడ్‌-19 శాస్త్రవేత్తలు, వైద్యారోగ్య నిపుణులు నిపుణులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

ఆస్ట్రాజెనెకాకు యూకే అనుమతి..

 టీకా సామర్థ్యంపై చైనా తొలి ప్రకటన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని