
19 ఏళ్ల సేవలు చాలు: ట్రంప్
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్లో అమెరికా సైనిక దళాలు చేసిన 19 ఏళ్ల సేవలు సరిపోతాయని అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. వాళ్లంతా తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ఇదే అంశాన్ని ఉటంకించారు. విరామంలేని యుద్ధాలతో అక్కడ సతమతవుతున్న అమెరికా దళాలను స్వదేశానికి రప్పిస్తానని ట్రంప్ అప్పట్లోనే అన్నారు. ఇదే అంశంపై గత నెలలో స్పందిస్తూ అనతి కాలంలోనే అఫ్గాన్లో ఉన్న అమెరికా దళాల సంఖ్యను 4000కు తగ్గించామన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్ కరోలినాలోని గ్యాస్టోనియాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ..‘‘ ఇతర దేశాల్లో యుద్ధం కోసం అమెరికా జవాన్లు రక్తం చిందించడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరు కూడా వినుండరు. అందుకే వాళ్లందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. దీనిని ఎవరూ వ్యతిరేకించరని అనుకుంటున్నాను. దాదాపు 19 ఏళ్లపాటు అఫ్గాన్లో చేసిన సేవలు చాలు. ప్రపంచంలోనే బలమైన సైనిక బలం అమెరికా సొంతం. అలాంటి మన జవాన్లు అక్కడ పోలీసుల్లా పని చేస్తున్నారు. ఇక దీనికి స్వస్తి చెబుదాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ నెల మొదట్లో ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి అఫ్గాన్లోని అమెరికన్ బలగాలన్నింటినీ వెనక్కి రప్పిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఈ పరిణామాన్ని తాలిబన్లు స్వాగతించారు. దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్లో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం గత ఫిబ్రవరి 29న చరిత్రాత్మక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఖతార్లోని దోహాలో జరిగిన కార్యక్రమంలో ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 14 నెలల్లో అఫ్గానిస్థాన్లోని తమ బలగాలను వెనక్కి తీసుకుంటామని అమెరికా ప్రకటించింది.అఫ్గాన్లో మోహరించిన 13వేల మంది బలగాలను రాబోయే నాలుగైదు నెలల్లో 8,600కు తగ్గించుకుంటామని అప్పట్లో అమెరికా వెల్లడించింది. తర్వాతి 14 నెలల్లో మొత్తం బలగాలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం అఫ్గాన్లో కేవలం 4000 మంది మాత్రమే అమెరికా సైనికులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.