చైనాకు మరోసారి చెక్‌పెట్టిన ట్రంప్‌!

పదవీకాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు చెక్‌ పెట్టే చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు.

Published : 28 Dec 2020 17:51 IST

టిబెట్‌ బిల్లుపై సంతకం

వాషింగ్టన్‌: పదవీకాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు చెక్‌ పెట్టే చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా ప్రమేయం లేకుండా టిబెట్‌ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లును అమెరికా చట్టసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. తాజా బిల్లుతో టిబెట్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉన్న కారణంగా చైనాపై ఆంక్షలు విధించింది. టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటయ్యే వరకూ అమెరికాలో కొత్తగా చైనా కాన్సులేట్‌ ఏర్పాటు చేసే వీలు లేకుండా చూసే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధికారులకు కల్పించింది.

టిబెట్‌లో దలైలామా వారసుడిని ఎన్నుకోవడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో టిబెటెన్లకే హక్కు ఉండే విధంగా ‘ది టిబెటన్‌ పాలసీ, సపోర్టు యాక్ట్‌-2020’ రూపొందించారు. ముఖ్యంగా తదుపరి దలైలామాను ఎన్నుకునే అధికారం ఆ వర్గానికే ఉండడంతో పాటు టిబెట్‌లోని లాసాలో అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటు చేసే విధంగా దీన్ని రూపొందించారు. కేవలం టిబెట్‌లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేసేలా చూడటానికి వీలుగా అంతర్జాతీయ మిత్రపక్షాలను కూడగట్టుకునే వీలుంటుంది. ఈ ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దానిపై నిర్ణయాలన్నీ ప్రస్తుత దలైలామా, టిబెట్‌ వాసులే తీసుకోవాలని అందులో పేర్కొంది. నీటి భద్రతపై ప్రాంతీయ కార్యాచరణను ప్రోత్సహించేలా అమెరికా విదేశాంగ శాఖ చర్యలు తీసుకునేలా ఈ చట్టం సూచిస్తోంది. నదీ జలాలపై హక్కులున్న దేశాల మధ్య సహకార ఒప్పందాలు చేసుకునే వీలుంటుంది.

అయితే, టిబెట్‌ అంశంపై అమెరికా చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదని..దీనిపై ట్రంప్ సంతకం చేయకూడదని ఈ మధ్యే హెచ్చరించింది. చైనా ఒత్తిడి చేసినప్పటికీ ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ ముందుకే వెళ్లారు. 

ఇదిలాఉంటే, ప్రస్తుతం ఉన్న 14వ దలైలామాను చైనా వేర్పాటువాదిగానే చూస్తోంది. చైనా నుంచి టిబెట్‌ను వేరు చేసేందుకు ప్రస్తుత దలైలామా ప్రయత్నిస్తున్నట్లు భావిస్తోంది.

ఇవీ చదవండి..
టిబెట్‌ అంశంపై ఢీ అంటే ఢీ!
మనసు మార్చుకున్న ట్రంప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని