అమెరికా నుంచి భారత్‌కు మరో 100 వెంటిలేటర్లు

కరోనా రోగుల చికిత్సకు ఉపయోగపడే మరో 100 వెంటిలేటర్లను అమెరికా భారత్‌కు అందజేసింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.......

Published : 20 Aug 2020 01:09 IST

దిల్లీ: కరోనా రోగుల చికిత్సకు ఉపయోగపడే మరో 100 వెంటిలేటర్లను అమెరికా భారత్‌కు అందజేసింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) కార్యక్రమంలో భాగంగా 200 వెంటిలేటర్లు విరాళంగా ఇవ్వనున్నట్టు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూఎస్‌ఏఐడీ సంస్థ భారత ప్రభుత్వం, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీతో సమన్వయం చేస్తూ తొలి విడతగా జూన్‌ 14న 100 వెంటిలేటర్లను భారత్‌కు అందజేసింది. తాజాగా మిగతా 100 కొత్త వెంటిలేటర్లను బుధవారం అందజేసినట్టు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా జస్టర్‌ మాట్లాడుతూ.. తుది విడత వెంటిలేటర్లను కూడా భారత్‌కు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టసమయంలో పోరాడుతున్న భారత్‌కు వెంటిలేటర్లు ఇస్తామన్న  ట్రంప్‌ హామీని నెరవేర్చామని తెలిపారు. గతంలో ట్రంప్‌ అభ్యర్థన మేరకు కరోనా చికిత్స కోసం భారత్‌ అమెరికాకు భారీ సంఖ్యలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేసిన  విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని