అన్‌లాక్‌ 5.0: వీటికి అనుమతి ఉంటుందా?

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా కొన్ని మినహాయింపులు ఇస్తోంది. ఇప్పుడిప్పుడే జనజీవనం

Updated : 28 Sep 2020 17:48 IST

న్యూదిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా కొన్ని మినహాయింపులు ఇస్తోంది. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. కాగా, మరో రెండు రోజుల్లో సెప్టెంబరు పూర్తవుతుంది. ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తుండగా, ఈరోజు లేదా రేపు అన్‌లాక్‌ 5.0ను కేంద్రం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతులకు విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు.

అక్టోబరు 1వ తేదీ నుంచి అన్‌లాక్‌ 5.0 ప్రారంభంకానుంది. దీంతో అక్టోబరులో వేటికి మినహాయింపులు ఇస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతవారం వర్చువల్‌గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లను ‘మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా’ గుర్తించాలని సలహాలు, సూచనలు అందాయి. త్వరలో దసరా, దీపావళి పండగలు రానున్న నేపథ్యంలో మరిన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది.

* నిబంధనలతో మాల్స్‌, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వగా, ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.

* అక్టోబర్‌లోనైనా సినిమా హాళ్లకు అనుమతి ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల సీటింగ్‌ విధానాన్ని కూడా నిర్ణయించవచ్చు. సీటు విడిచి సీటులో కూర్చొనే నిబంధనలు పెడితే బాగుంటుందని సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే ఇప్పటికే కేంద్రానికి సూచించారు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అదే విధంగా భౌతిక దూరం కోసం ఒక్కో వరుస విడిచిపెట్టే అవకాశం కూడా ఉంది. సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.

* కరోనాతో అత్యధికంగా నష్టపోయిన రంగం పర్యటకం. ఇప్పటికే తాజ్‌మహల్‌ వంటి దర్శనీయ స్థలాలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌5.0లో మరిన్ని పర్యటక ప్రాంతాలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

* ఇప్పటికే 9-12 తరగతులకు అనుమతి ఇవ్వగా, ప్రాథమిక విద్యా సంవత్సరంపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని