అక్టోబర్‌ నాటికి సాధారణ జీవనం

భారతీయులందరికీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ఫార్మా దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ ఆదార్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు....

Updated : 23 Feb 2024 19:14 IST

ఆశాభావం వ్యక్తం చేసిన సీరమ్‌ సీఈఓ

దిల్లీ: భారతీయులందరికీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ఫార్మా దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ ఆదార్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 జనవరిలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల చివరినాటికి సీరమ్‌ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌ కల్లా దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా అందుబాటులోకి వస్తుందని, ఆ తర్వాత భారతీయులు సాధారణ జీవనం గడుపుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నెల చివరి నాటికల్లా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశం ఉంది. అయితే అందరికీ టీకా అందించేందుకు మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు. టీకాకు అనుమతి లభిస్రతే 2021 జనవరి నాటికి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తామనే నమ్మకం ఉంది’ అని పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలని సీరమ్‌తోపాటు భారత్ బయోటెక్ సంస్థలు కొద్ది రోజుల క్రితం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను కోరాయి. ఆ సంస్థల అభ్యర్థనను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నిపుణుల కమిటీ పరిశీలించింది. టీకాల భద్రత, సమర్థతను తెలిపే అదనపు సమాచారం ఇవ్వాలని ఇరు సంస్థలను సీడీఎస్‌సీఓ కోరింది. సీరమ్‌ సమర్పించిన అత్యవసర వినియోగ అనుమతుల దరఖాస్తును పరిశీలించిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ).. 2, 3 దశల్లో జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను సమర్పించాల్సిందిగా ఆ సంస్థను కోరింది. ఎస్‌ఈసీ ఆదేశం మేరకు 2, 3 దశల్లో జరిపిన పరీక్షలకు సంబంధించిన డేటాను సీరమ్‌ సంస్థ కమిటీకి సమర్పించింది.

ఇవీ చదవండి...

ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌: విజయన్‌ ప్రకటన

ఒక్కో విడతలో వంద మందికి టీకా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని