హాథ్రస్‌ నిరసన: ఆగ్రాలో స్వల్ప ఉద్రిక్తత

యూపీలోని అగ్రాలో హాథ్రస్‌ ఘటనకు వ్యతిరేకంగా వాల్మీకీ సమాజం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు స్వల్ప ఉద్రిక్తకరంగా మారాయి. వాల్మీకీ సమాజానికి చెందిన నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Updated : 03 Oct 2020 17:15 IST

ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో హాథ్రస్‌ ఘటనకు వ్యతిరేకంగా వాల్మీకీ సమాజం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీశాయి. వాల్మీకీ సమాజానికి చెందిన నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితులను చక్కబెట్టేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ఆగ్రా ఎస్పీ బీఆర్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లోనూ శాంతిభద్రతలకు భంగం వాటిల్లే సందేశాలపై సైబర్‌ విభాగం పోలీసులు తనిఖీలు చేపట్టారని వెల్లడించారు.

కాగా హాథ్రస్‌ ఘటనను నిరసిస్తూ వాల్మీకీ సమాజం సభ్యులు నగరంలో పారిశుద్ధ్య పనులను నిలిపివేయాలంటూ పిలుపునిచ్చారు. దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మరోవైపు రాహుల్‌, ప్రియాంకగాంధీలు రెండోసారి బాధిత కుటుంబాన్ని కలిసేందుకు శనివారం హాథ్రస్‌ బయలుదేరారు. గురువారం తొలిసారి బాధిత కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్‌ అగ్రనాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని