
కరోనాను కట్టడి చేయలేం..
అంగీకరించిన అమెరికా అత్యున్నతాధికారి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 విజృంభిస్తోంది. ఇక్కడి కేసుల సంఖ్య విషయంలో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదౌతున్నాయి. ఈ దేశంలో ప్రతిరోజు సుమారు వెయ్యి కరోనా వైరస్ మరణాలు సంభవిస్తుండగా .. మొత్తం మరణాలు రెండు లక్షల మార్కును ఎప్పుడో దాటేశాయి. ఈ నేపథ్యంలో తాము కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి పరోక్షంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించటం ప్రాముఖ్యం సంతరించుకుంది.
ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాన్ని దాటవేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ మహమ్మారిని ఎందుకు నియంత్రించడం లేదన్న ప్రశ్నకు జవాబుగా.. అది వైరస్ ద్వారా వ్యాప్తించే ఫ్లూ మాదిరి అంటువ్యాధి కావటం వల్లనే అని ఆయన అంగీకరించారు. కొవిడ్ను నియంత్రించేందుకు తాము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆ వెంటనే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
దేశ చరిత్రలోనే పెద్ద వైఫల్యం
ఈ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. మహమ్మారి కరోనా వైరస్ను సాధారణ ఫ్లూతో పోల్చడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తమ అశక్తతను అంగీకరించిందని.. ఇది అమెరికా చరిత్రలోనే పెద్ద వైఫల్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాము తొలినుంచీ వెల్లడిస్తూ వచ్చామన్నారు. ప్రపంచ జనాభాలో కేవలం నాలుగు శాతాన్ని కలిగిఉన్న అమెరికాలో.. ఇరవై శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా, తన సమీప సిబ్బందికి కరోనా సోకినప్పటికీ రిపబ్టికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనటం కూడా విమర్శలకు తావిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.