
అమెరికాలో అసలు పోరు మొదలైంది..!
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. కీలకమైన 12 స్వింగ్స్టేట్స్లో ఫలితాలు మలుపులు తిరుగుతున్నాయి. ఉదయం కౌంటింగ్ మొదట్లో బైడెన్ ఆధిపత్యం కనిపించినా.. ఆ తర్వాత ట్రంప్ వైపు మొగ్గు చూపాయి. కేవలం అరిజోనా, న్యూహాంప్షైర్, నెవడాలు మొదటి నుంచి బైడెన్కు పట్టంకట్టాయి. కానీ, విస్కాన్సిన్ ఫలితాలు మాత్రం ట్రంప్.. బైడెన్ ఇద్దరినీ ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బైడెన్ 0.3శాతం ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మధ్యలో ట్రంప్ దాదాపు 4శాతానికి పైగా ఆధిక్యంలో దూసుకుపోయినా.. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయారు. దాదాపు 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఇక్కడ బైడెన్కు 49.4శాతం పోల్కాగా.. ట్రంప్నకు 49.1శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఐదుశాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. అవి ఇక్కడి 10 ఎలక్టోరల్ ఓట్లు ఎవరికి దక్కనున్నాయో తేల్చనున్నాయి.
భారీ మెజార్టీలు కష్టమే..
ప్రస్తుతం ఉన్న ఫలితాల ప్రకారం చూస్తే ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశం ఉంది. అప్పుడు ఫెయిత్లెస్ ఎలక్టోరల్ ఓట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తే వారిలో ఇద్దరు ట్రంప్కు ఓటు వేసేందుకు నిరాకరించారు. అలానే 227 ఓట్లు హిల్లరీకి రాగా.. వారిలో ఐదుగురు ఆమెకు ఓటు వేసేందుకు నిరాకరించారు.
హిల్లరీని దాటేసిన బైడెన్..
తాజా ఫలితాలు వచ్చే సమయానికి జో బైడెన్ 232 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు. 2016 డెమొక్రాటిక్ పార్టీకి వచ్చిన స్థానాల కంటే ఇవి ఎక్కువ. అరిజోనాలో గెలుపుతో బైడెన్, హిల్లరీ రికార్డు దాటేశారు. గతంలో అరిజోనాను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ఆ 11 ఎలక్టోరల్ ఓట్లు తగ్గాయి. 1948లో హారీ ట్రూమన్కు ఓటేసిన ఈ రాష్ట్రం.. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత 1996లో బిల్ క్లింటన్కు పట్టం కట్టింది. మళ్లీ ఇప్పుడు జోబైడెన్ వైపు మొగ్గు చూపడం డెమొక్రాటిక్ బృందంలో ఉత్సాహాన్ని నింపింది.
పెన్సిల్వేనియాలో పీటముడి..?
అమెరికా ఎన్నికలు హోరాహోరీగా సాగుతుండటంతో పెన్సిల్వేనియాలోని 20 ఎలక్టోరల్ స్థానాలు కీలకం కానున్నాయి. దీనిని గెలిచినవారికి మేజిక్ మార్క్ అయిన 270ను దాటే అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా అనుమతిస్తున్నారని ట్రంప్ మండిపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళతానని ఆయన ప్రకటించారు. అదే సమయంలో మరో 10లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని.. చివరి ఓటు వరకు లెక్కిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ టామ్ వోల్ఫ్ ప్రకటించారు. ఇందుకు తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై విమర్శలు చేయడాన్ని ప్రజాస్వామ్యం, పెన్సిల్వేనియా, తమ ఓట్లపై దాడి చేయడమే అని పేర్కొన్నారు.
వివాదం ఇదీ..
నెవాడ, విస్కాన్సన్, మిషిగాన్, పెన్సిల్వేనియాల్లో ఎన్నికలు జరిగిన మూడు రోజుల వరకు కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్లను అనుమతించారు. మొదటి నుంచి మెయిల్ ఇన్ బ్యాలెట్లపై చిటపటలాడుతున్న ట్రంప్కు ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనిని అతిపెద్ద మోసంగా ఆయన అభివర్ణించారు. ఈ రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి తానే గెలిచినట్లు ప్రకటించుకొన్నారు.
ట్రంప్ ప్రకటనపై జోబైడెన్ విమర్శల వర్షం కురిపించారు. ట్రంప్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ‘అమెరికా ప్రజల హక్కులను హరించడానికి నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నం అది. ఆయన న్యాయస్థానికి వెళితే ఎదుర్కొనేందుకు తమ న్యాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని అన్నారు.
పక్కదారి పట్టిస్తున్నారు.. డెమొక్రాట్లపై ట్రంప్ విమర్శ
ఇది గెలిస్తేనే ‘ట్రంప్’లకు ఫ్యూచర్..!