Space Trip: బెజోస్‌తో రోదసీలోకి వెళ్లేదెవరు..?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహరించే అవకాశం ఎవరికి దక్కనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇందుకోసం నిర్వహించిన వేలం ప్రక్రియ....

Published : 14 Jun 2021 01:31 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహరించే అవకాశం ఎవరికి దక్కనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇందుకోసం నిర్వహించిన వేలం ప్రక్రియ శనివారంతో ముగియగా... 2.80 కోట్ల అమెరికన్ డాలర్లకు బిడ్ దాఖలు చేసిన వ్యక్తిని అదృష్టం వరించింది. అయితే ఆ వ్యక్తి పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ వెల్లడించలేదు. అంతరిక్ష యాత్ర ప్రారంభమయ్యేందుకు కొద్ది రోజుల ముందు ఆ వివరాలు వెల్లడించనున్నారు.

అంతరిక్షంలో విహరించే అవకాశం కోసం శుక్రవారం నాటికి 159 దేశాలకు చెందిన సుమారు 7500 మంది ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన 20 మంది బిడ్డర్లతో శనివారం వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ వేలంలో 2.80 కోట్ల అమెరికన్‌ డాలర్లకు బిడ్‌ దాఖలు చేసిన వ్యక్తికి అంతరిక్ష యానం చేసే అరుదైన అవకాశం లభించింది. బిడ్డింగ్‌ మొత్తాన్ని బ్లూ ఆరిజిన్‌ ఫౌండేషన్‌, క్లబ్‌ ఫర్‌ ది ఫ్యూచర్‌కు విరాళంగా అందించనుంది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ రంగాలకు సంబంధించిన కెరీర్‌లను ఎంచుకునేలా భావితరాల్లో స్ఫూర్తినింపేందుకు అంతరిక్షంలో జీవనానికి సంబంధించిన పరిశోధనలకు ఈ నిధులు వినియోగిస్తారు.

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్‌ వచ్చే నెలలో తొలిసారిగా మానవ సహిత రోదసీ యాత్ర చేపట్టనుంది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన వ్యోమ నౌక న్యూ షెపార్డ్‌ జులై 20న టెక్సాస్‌ నుంచి నింగికి ఎగరనుంది. జెఫ్‌ బెజోస్‌, ఆయన సోదరుడు మార్క్‌ వ్యోమగాములతో కలిసి బిడ్డింగ్‌లో గెలుపొందిన వ్యక్తి అంతరిక్షయానం చేయనున్నారు. పది నిమిషాలపాటు ఈ యాత్ర సాగుతుంది. అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా నౌక తిరిగి వస్తుందో? లేదో పరిశీలించేందుకు 15 యాత్రలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసినట్లు మే నెలలో బ్లూ ఆరిజిన్‌ ప్రకటించింది. ఈ యాత్ర ద్వారా అంతరిక్ష పర్యాటకానికి అడుగులు పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని