Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌.. ఆపై ట్విస్ట్‌.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!

ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురై తన కుటుంబానికి దూరమైన ఓ బాలిక తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి తన సొంతింటికి చేరింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా ఉన్న......

Published : 08 Aug 2022 02:25 IST

ముంబయి: ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురై తన కుటుంబానికి దూరమైన ఓ బాలిక తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి తన సొంతింటికి చేరింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తలపించేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని అంధేరిలో వెలుగుచూసింది. అయితే, బాలిక తిరిగి తన కుటుంబాన్ని చేరడానికి ఓ డిజిటల్‌ మిస్సింగ్‌ పోస్టరే కీలక ఆధారంగా పనిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 జనవరి 22. పూజ (7) ఉదయాన్నే తన సోదరుడితో కలిసి అంధేరిలోని ఓ పాఠశాలకు వెళ్లింది. అయితే, అక్కడ హెన్రీ జోసెఫ్‌ డిసౌజా అనే వ్యక్తి ఆమెకు ఐస్‌క్రీమ్‌ ఆశచూపి కిడ్నాప్‌ చేశాడు. పూజను ఎవరూ గుర్తు పట్టలేరని నిర్ధారించుకున్నాక హెన్రీ ఆమెను కర్ణాటకలోని ఓ హాస్టల్‌లో చేర్పించాడు. బాలిక పేరును అన్నె డిసౌజాగా మార్చాడు. అయితే, కొన్నాళ్లకు హెన్రీ దంపతులకు బిడ్డ పుట్టడంతో పూజను తీసుకొచ్చి ఇంటి పనులు చేయించుకోవడంతో పాటు సరిగా చూసుకొనేవారు కాదు. అలా తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. 

ఆ పోస్టర్‌లో నాలుగు నెంబర్లు పనిచేయలేదు.. చివరకు..

కానీ, హెన్రీనే తన తండ్రిగా భావిస్తూ వచ్చిన పూజకు ఒక రోజు షాకింగ్‌ విషయం తెలిసింది. అతడు తాగిన మైకంలో ఉన్నప్పుడు ఆమె తన కూతురు కాదన్న విషయం పూజ వద్దే చెప్పాడు. దీంతో షాక్‌ అయిన బాలిక.. తన గత ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఇందుకోసం తన ఫ్రెండ్‌ సహకారం తీసుకొని ఇంటర్నెట్‌లో శోధన కొనసాగించింది. Pooja missing అని వెతకగా.. చివరకు 2013లో తాను మిస్సింగ్‌ అయినట్టుగా ఉన్న పోస్టర్‌ ఒకటి కంటపడింది. దాంట్లో ఐదు ఫోన్‌ నంబర్లు ఉండగా.. నాలుగు నంబర్లు పనిచేయలేదు. చివరకు ఐదో నంబర్‌కు డయల్‌ చేయగా.. ఆ నంబర్‌ ఆమె కుటుంబం పొరుగున నివసించే రఫీక్‌ అనే వ్యక్తిది. దీంతో పూజ తన గురించి మొత్తం విషయాన్ని చెప్పింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన రఫీక్‌ వీడియో కాల్‌ చేసి బాలికను పూజగా గుర్తించాడు. ఆ తర్వాత ఆమె తల్లితో మాట్లాడే ఏర్పాటు చేయించాడు. పూజను చూడగానే తల్లి గుర్తుపట్టి.. మొబైల్‌ స్క్రీన్‌పై ఒకరినొకరు చూసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.

చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. డిసౌజాను అరెస్టు చేసి.. పూజను ఆమె కుటుంబంతో కలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ ఎక్కడుందో, ఏమైపోయిందో తెలియక నరకయాతన అనుభవించిన ఆ తల్లికి బాలికను చూడగానే పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్న దృశ్యాలు అక్కడున్నవారిని భావోద్వేగానికి గురిచేశాయి. అయితే, కిడ్నాపైన తర్వాత పూజ తన తండ్రిని కోల్పోయింది. చిన్నప్పుడు తమనుంచి దూరమైన పూజ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తమను కలుసుకోవడంతో బాలిక తల్లి, సోదరుడి ఆనందానికి అవధుల్లేవు. మరోవైపు, హెన్రీని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాపింగ్‌, చట్టవ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. పిల్లలు పుట్టకపోవడం వల్లే ఆ దంపతులిద్దరూ బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్టు తెలిపిన పోలీసులు.. ఈ కేసులో అతడి భార్యను కూడా నిందితురాలిగా పేర్కొన్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని