భుజంపై చిన్నారి మృతదేహం.. అందరితో పాటే బస్సులో ప్రయాణం..!

మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎలాంటి వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనంలో ఊరు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేవు. దాంతో చిన్నారి బంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. 

Updated : 20 Oct 2022 11:40 IST

భోపాల్‌: కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల ప్రాంత ప్రజలు హృదయవిదారక పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ బస్టాండ్‌ వరకూ వెళ్లాడు. తన ఊరు చేరుకోవడానికి ఇతర ప్రయాణికుల మాదిరిగానే బస్సులో ప్రయాణించాడు. మృతదేహంతోపాటుగా అతడు నడుచుకుంటూ వెళ్తోన్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దాంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కానీ, తిరిగివచ్చే సమయంలో చిన్నారి సమీపబంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎటువంటి వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనంలో ఊరు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేవు. దాంతో చిన్నారి మృతదేహాన్ని భుజం మీదే మోసుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడొకరు సహాయం చేశారు. కొద్దినెలల క్రితం అదే ఆస్పత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఛాతర్‌పుర్ ప్రాంతంలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై ప్రశ్నలు వస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని