Air India: రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల పడిగాపులు.. మరో విమానం పంపుతున్న భారత్

ఇంజిన్ సమస్య వల్ల ఎయిరిండియా (Air India) ప్రయాణికులు రష్యాలో చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు కేంద్రం తక్షణ చర్యలు ప్రారంభించింది.

Updated : 07 Jun 2023 13:11 IST

దిల్లీ: దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానం నిన్న రష్యా(Russia)లో అత్యవసరంగా దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం సత్వర చర్యలు ప్రారంభించింది. గమ్యస్థానానికి చేరేందుకు రష్యాలో పడిగాపులు కాస్తోన్న ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని( relief aircraft) పంపనుంది. అది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముంబయి నుంచి ఈ విమానం బయలుదేరనుంది.

శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా(Air India) విమానం ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తడంతో దానిని అత్యవసరంగా రష్యాలోని మగదాన్‌ నగరంలో దించారు. మంగళవారం దిల్లీ నుంచి 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-173 విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ విమానాన్ని రష్యాలో సురక్షితంగా ల్యాండ్‌ చేశామని, ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.

ఇబ్బందులున్నా.. బాగానే ఉన్నాం..!

ఎయిరిండియా విమానం దిగిన ఆ మగదాన్ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆ ప్రాంతంలో హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ప్రయాణికుల్లో కొందర్ని డార్మిటరీల్లో ఉంచారు. అలాగే లగేజ్ మొత్తం విమానంలో ఉండిపోవడంతో వారు ఇబ్బందులు ఎదర్కొంటున్నట్లు ఓ మీడియా సంస్థ కథనం పేర్కొంది. ‘ప్రయాణికుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. మా బ్యాగులన్నీ విమానంలోనే ఉండిపోయాయి. హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో మమ్మల్ని బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అక్కడ భాష అడ్డంకిగా మారింది. కొంతమందిని పాఠశాలకు తరలించారు. ఆహారం విషయంలో ఇబ్బంది ఏర్పడింది. కొంతమంది బ్రెడ్, సూప్‌ తాగి సరిపెట్టుకుంటున్నారు. కొంతమందికి మెడిసిన్‌ కూడా అందుబాటులో లేదు. అయితే మేం బాగానే ఉన్నాం. మా కుటుంబాలతో కూడా మాట్లాడుతున్నాం’ అని ఓ ప్రయాణికుడు మీడియాకు వెల్లడించారు.

మేం గమనిస్తున్నాం: అమెరికా 

ప్రస్తుత పరిస్థితి తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విమానంలో అమెరికా పౌరులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్యను తాము తనిఖీ చేస్తున్నట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులను తరలించడం కోసం మరో విమానాన్ని పంపించేందుకు భారత్‌కు అనుమతినిచ్చినట్లు రష్యా విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని