సరిహద్దుల్లో మరో సొరంగాన్ని కనుగొన్న ఆర్మీ

భారత్‌లోకి ఉగ్రవాద చొరబాట్లను ఉసిగొల్పేందుకు పాక్‌ చేస్తున్న పన్నాగాలు శ్రుతి మించుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని ఇరుదేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆ దేశం అక్రమంగా చేపడుతున్న భూ అంతర్గత రహస్య సొరంగ నిర్మాణాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 23 Jan 2021 20:24 IST

శ్రీనగర్‌: భారత్‌లోకి ఉగ్రవాద చొరబాట్లను ఉసిగొల్పేందుకు పాక్‌ చేస్తున్న పన్నాగాలు శ్రుతి మించుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని ఇరుదేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆ దేశం అక్రమంగా చేపడుతున్న భూ అంతర్గత రహస్య సొరంగ నిర్మాణాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అధికారులు రెండు రహస్య సొరంగాలను కనుగొనడం పాక్‌ దుర్బుద్ధిని బట్టబయలు చేస్తోంది. తాజాగా కథువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌లో పాక్‌ ఉగ్రవాదులు అక్రమంగా నిర్మించిన రహస్య సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 

‘భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది చేపట్టిన యాంటీ టన్నెల్‌ ఆపరేషన్‌లో భాగంగా ఓ రహస్య సొరంగాన్ని కనుగొన్నాం. జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టార్‌ పన్సార్‌ అవుట్‌ పోస్ట్‌ ప్రాంతంలో ఈ సొరంగాన్ని నిర్మించారు. గత పదిరోజుల్లో ఒక్క హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది కంట పడిన రహస్య సొరంగాల్లో ఇది రెండోది. గత ఆరు మాసాల కాలంలో చూసుకుంటే ఇది నాలుగో సొరంగం కావడం గమనార్హం. ఈ సొరంగ మార్గం దాదాపు 150 మీటర్ల పొడవు, 30 అడుగుల లోతు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నాం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది’ అని చెప్పారు. కాగా జనవరి 13న కూడా హీరానగర్ సెక్టార్‌లోని బోబియాన్‌ గ్రామంలో 150 మీటర్ల పొడవున్న రహస్య సొరంగాన్ని భద్రతా సిబ్బంది కనుగొన్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

చైనా తగ్గించేదాకా.. భారత్‌ తగ్గదు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని