Delhi: ‘మహా ర్యాలీ’లో లక్ష మంది ప్రజలు పాల్గొంటారు: ఆప్‌

దిల్లీలో అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను దిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ‘మహా ర్యాలీ’నిర్వహించనుంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తు ప్రజలు పాల్గొనబోతున్నారని ఆప్‌ ప్రతినిధులు తెలిపారు. 

Published : 10 Jun 2023 17:17 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీ (Delhi)లో పరిపాలనా సేవలపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న విషయంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aap) ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని ఆప్‌ నిర్ణయించింది. ఈ ‘మహా ర్యాలీ’కి సాధారణ ప్రజలే లక్ష మంది వస్తారని ఆ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), పంజాబ్‌ సీఎం భగవత్‌మాన్‌ (Bhagwant Mann) ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు ఈ ర్యాలీకి హాజరవుతారని పేర్కొన్నారు. 

‘‘దిల్లీ ప్రజలు మూడు సార్లు కేజ్రీవాల్‌ను సీఎంగా ఎంచుకున్నారు. దిల్లీలో పనిచేసే అధికారులు సీఎంకు జవాబుదారీగా లేకపోతే మా ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు అమల్లోకి రావు. దిల్లీ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ గురించి.. దాని వల్ల ప్రజల రోజువారీ జీవనంపై ఎలాంటి ప్రభావం పడుతోందో తెలియజేస్తూ దిల్లీ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాం.’’అని ఆప్‌ ప్రతినిధి రీనా గుప్తా మీడియాకు తెలిపారు.

దిల్లీలో అధికారులపై నియంత్రణ వివాదంపై మే నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దిల్లీ రాజధాని ప్రాంతం లోపల పోలీసులు, శాంతి భద్రతలు, భూములపై తప్ప మిగతా పరిపాలన సేవలపై ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి.. ప్రభుత్వానికి ఉండే అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి కట్టబెట్టింది. దీనిపై ఆప్‌ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం మహార్యాలీని నిర్వహిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని