
అమెరికాలో అది సాధ్యమే: ఫౌచీ
100 రోజుల్లో 100 మిలియన్ డోసుల పంపిణీపై వ్యాఖ్య
వాషింగ్టన్: వంద రోజుల్లో వంద మిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందచేసే లక్ష్యాన్ని చేరటం కచ్చితంగా సాధ్యమేనని.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 100 రోజుల్లో పది కోట్ల టీకా డోసులను ప్రజలకు అందజేస్తానని.. జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ లక్ష్యాన్ని చేరటం అసాధ్యమేమీ కాదని ఫౌచీ కూడా అభిప్రాయపడ్డారు. కాబోయే అధ్యక్షుడికి కొవిడ్-19 వ్యవహారాల ముఖ్య సలహాదారుగా ఫౌచీని నియమించిన సంగతి తెలిసిందే.
అమెరికా ప్రభుత్వ సంస్థ సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ఇప్పటివరకు 31.1 మిలియన్ల డోసులను వివిధ కేంద్రాలకు రవాణ చేశారు. వాటిలో కేవలం 40 శాతం అంటే 12.2 మిలియన్ల మోతాదులను మాత్రమే ప్రజలకు ఇచ్చారు. ఈ నెల చివరి నాటికి 20 మిలియన్ల మందికి కరోనా టీకా తొలిడోసు లభించనుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ప్రస్తుతం 3.96 లక్షలకు పైగా ఉన్న మరణాల సంఖ్య.. ఫిబ్రవరి నాటికి ఐదు లక్షలకు చేరుకోగలదని ఓ అంచనా. ఈ సంఖ్య పెరగకుండా ఉండేందుకు సత్వర కరోనా టీకా సరఫరాయే మార్గమని పరిశీలకులు అంటున్నారు.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.