దిశా రవికి బెయిల్‌ మంజూరు 

టూల్‌ కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవికి బెయిల్‌ మంజూరైంది. దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు.....

Updated : 23 Feb 2021 17:18 IST

దిల్లీ: టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవికి బెయిల్‌ మంజూరైంది. దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. స్వీడన్‌కు చెందిన పర్యావరణవేత్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశా రవితో పాటు నికితా జాకబ్‌, శంతను ములుక్‌లకు సంబంధం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఫిబ్రవరి 13న బెంగళూరులోని తన నివాసంలోనే 22 ఏళ్ల దిశా రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆరు రోజులు పోలీస్‌ కస్టడీలో, రెండు రోజులు జైలులో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రపంచ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ కలకలం రేపింది. ఈ టూల్‌ కిట్‌ వ్యవహారంలో దిశా రవికి కూడా సంబంధం ఉందంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను దిల్లీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు తొలుత ఆమెను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో పోలీసుల అభ్యర్థన మేరకు మరో రోజు పొడిగించింది. అయితే, ఆ గడువు కూడా నేటితో ముగియనుండటంతో పోలీసులు మరో నాలుగు రోజుల పాటు దిశను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరోవైపు, శనివారం దిశారవి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం ఈ రోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఇంజినీర్‌ నికితా జాకబ్‌, న్యాయవాది శంతను ములుక్‌లకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

దిశా రవికి ఖలిస్థానీ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. మరోవైపు, దిశకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని దిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఆమె బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని