Corona: విదేశాల్లో కేసులు పెరుగుతున్నా.. భారత్‌లో తక్కువ.. కారణమిదే: పూనావాలా

యూకే, అమెరికా, చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ సీరమ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా....

Published : 05 Apr 2022 02:11 IST

పుణె: యూకే, అమెరికా, చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ సీరమ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సరైన టీకాలను ఎంచుకోవడం వల్లే ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తక్కువగా వస్తున్నాయన్నారు. సోమవారం ఆయన పుణెలో విలేకర్లతో మాట్లాడారు. ఒకవేళ మన దేశంలో కొవిడ్‌ నాలుగో దశ వచ్చినా తేలికపాటి ప్రభావమే ఉంటుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. దేశంలో బూస్టర్‌ డోసుపై కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ప్రయాణాలు చేసే ప్రతిఒక్కరికీ బూస్టర్‌ డోసు అవసరమని.. దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందన్నారు. బూస్టర్‌ డోసుపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు. 

కొత్త వేరియంట్లపై ప్రస్తుత టీకాలు పనిచేస్తాయా?

అనేక ఇతర దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోసు అందిస్తున్నాయన్నారు. భారత్‌లో కూడా ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని పూనావాలా పేర్కొన్నారు. దేశంలో అర్హులైన వారందరికీ రెండు డోసులూ పంపిణీ చేయడంలో కేంద్రం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. ఇతర దేశాల్లో కన్నా మన టీకాలే మెరుగని నిరూపితమయ్యాయన్నారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో చూస్తే భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయనీ.. సరైన టీకాలను ఎంచుకోవడం వల్లే మన వద్ద తక్కువ కేసులు వస్తున్నాయని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రూపంలో ఉన్న టీకాలు కొత్త వేరియంట్లపై పనిచేస్తాయా? అని విలేకర్లు అడగ్గా.. బూస్టర్‌ డోసు తీసుకుంటే భవిష్యత్తు వేరియంట్ల నుంచి రక్షణ పొందొచ్చన్నారు. కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సహకారంతో దేశంలో కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ సంస్థ తయారుచేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని