Aditya L1 Mission: భూమికి బై.. బై.. ఆదిత్య ఎల్-1లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ ఉపగ్రహ కక్ష్యను పెంచి ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం సూర్యుడి దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
బెంగళూరు: సూర్యుడి(Sun) రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య ఎల్-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్(ట్విటర్లో) పోస్టు చేసింది. ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక(Space Carft) లగ్రాంజ్(Langrnge) పాయింట్-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్ పాయింట్-1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు.
చంద్రయాన్-3(Chandrayaan 3) విజయవంతం తర్వాత ఇస్రో సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.