చైనా సెల్ఫ్‌గోల్‌..!

సరిహద్దుల్లో డ్రాగన్‌ తెంపరితనం రోజురోజుకూ పెరిగిపోతోంది.  తాను నిబంధనలు ఉల్లంఘిస్తే భారత్‌ ప్రశ్నించ కూడదనే మైండ్‌సెట్‌ నుంచి బయటకు రాలేకపోతోంది. తన బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిలిచిన భారత్‌ను చూసి చైనాకు ఏంచేయాలో పాలుపోవండంలేదు.

Published : 09 Sep 2020 01:17 IST

 45 ఏళ్ల తర్వాత పేలిన  తూటా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సరిహద్దుల్లో డ్రాగన్‌ తెంపరితనం రోజురోజుకూ పెరిగిపోతోంది.  తాను నిబంధనలు ఉల్లంఘిస్తే భారత్‌ ప్రశ్నించకూడదనే ధోరణి నుంచి బయటకు రాలేకపోతోంది. తన బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిలిచిన భారత్‌ను చూసి చైనాకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. దీంతో కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న వాస్తవాధీన రేఖను రణరంగంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ తుపాకులు గర్జించాయి. సుమారు 45ఏళ్ల తర్వాత సోమవారం రాత్రి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిగాయి. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భారత్‌-చైనాల సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందానికి ఇది తూట్లు పొడిచి.. వివాదాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.  

చివరిసారిగా 1975లో..

చివరి సారిగా తుపాకులు వినియోగించిందీ డ్రాగన్‌ సైనికులే. 1975లో పీఎల్‌ఏకు చెందిన కొందరు తులుంగ్‌ లా వద్ద భారత్‌ అధీనంలోని భూభాగంలోకి చొరబడ్డారు. అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్‌ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్‌-చైనాల సరిహద్దు వద్ద శాంతిని పునరుద్ధరించడానికి చాలా ఒప్పందాలు జరిగాయి. వీటిల్లో 1996లో జరిగిన ఓ ఒప్పందంలో ఇరుపక్షాలు కాల్పులు జరపకూడదని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల వరకు జీవ, రసాయన ఆయుధాల వినియోగం, పేలుడు కార్యకలాపాలు జరపడం, తుపాకులతో లేదా పేలుళ్ల సాయంతో వేటాడం నిషేధం. చిన్న ఫైరింగ్‌ రేంజిల్లో మాత్రం సైన్యం జరిపే రొటీన్‌ కాల్పులను సాధన చేసుకోవచ్చు. తాజాగా సోమవారం పాంగాంగ్‌ సరస్సు వద్ద జరిగిన ఘటన ఈ ఒప్పందానికి తూట్లు పొడిచింది. 

కాల్పులను అంగీకరించిన డ్రాగన్‌..

చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ సరిహద్దుల వెంట కాల్పులు జరిగాయని తొలుత ప్రకటించింది. భారత దళాలు వాస్తవాధీన రేఖను దాటి తమ జవాన్ల వద్దకు వచ్చి కాల్పులు జరిపాయని పేర్కొంది. దీంతో చైనా దళాలు జవాబు చర్యలు చేపట్టాయని పేర్కొంది. కానీ, భారత‌ సైన్యం మాత్రం పీఎల్‌ఏ సైనికులు కాల్పులు జరిపారని.. తమ‌ దళాలు పరిణతితో శాంతిని కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాయని పేర్కొంది. అంతేకానీ జవాబు చర్యలు చేపట్టినట్లు ఎక్కడా చెప్పలేదు. భారత్‌ కాల్పులు జరిపినట్టైతే కనీసం ప్రతి చర్యగా జరిపామని అయినా చెబుతుంది. ఈ ప్రకటనలో ఎక్కడా అటువంటివి వెల్లడించలేదు. అంటే చైనా వైపు నుంచి కాల్పులు జరిగాయనే అర్థం. ఆ తప్పును భారత్‌పై నెట్టేలా గ్లోబల్‌ టైమ్స్‌ తొలుత వార్తను పబ్లిష్‌ చేసింది.  కీలక శిఖరాలను భారత్‌ నుంచి స్వాధీనం చేసుకోవడానికి చైనా చేసిన విఫలయత్నంగా ఇది మిగిలిపోయింది.  

పాంగాంగ్‌ సరస్సుకు రండి..

ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే చైనా పాంగాంగ్‌ సరస్సును అంతర్జాతీయ పర్యాటకుల కోసం తెరిచినట్లు వీడియోలు విడుదల చేసింది.  ఆ సరస్సు తమదే అన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను పన్నింది. దీనికి తోడు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు వీసాలను జారీ చేస్తే.. భవిష్యత్తులో ఈ ప్రాంతం తమదే అని వాదించుకోవడానికి జారీ చేసిన వీసాలను చూపే యత్నం చేయవచ్చు. 

గ్లోబల్‌ టైమ్స్‌ వీరంగం..

సోమవారం అర్ధరాత్రి నుంచి చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పలు దుందుడుకు వాఖ్యలు చేస్తోంది. ‘‘మేము భారత్‌ను తీవ్రగా హెచ్చరిస్తున్నాం: నువ్వు హద్దులు దాటావు ! మీ సరిహద్దు దళాలు హద్దులు దాటాయి! మీ జాతీయవాద ప్రజాభిప్రాయం హద్దులు దాటింది! మీరు అనుసరిస్తున్న చైనా విధానం హద్దులు దాటింది! మీరు అతివిశ్వాసంతో పీఎల్‌ఏ-చైనా ప్రజలను కవ్విస్తున్నారు. ఇది కొండ అంచులపై శీర్షాసనం వేసినట్లుంది’’ అంటూ ట్వీట్‌ చేసింది. చైనాతో యుద్ధం జరిగితే భారత్‌ పడే ఇబ్బందులపై కథనాలు రాసింది. దాని ఎడిటర్‌ హు షిజిన్‌ కూడా భారత్‌ను భయపెట్టేందుకు ఓ ట్వీట్‌ చేశారు. 1962 కంటే ఘోరంగా ఓడిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. 

డ్రాగన్‌కు ఆ ఉక్కపోత దేనికి..

ఆగస్టు 29-30 రాత్రి భారత్‌ తన భూభాగంలోని కీలక పర్వతాలపై పట్టు సాధించిన తర్వాత చైనాకు ఉక్కపోత పెరిగిపోయింది. ఇవి పాంగాంగ్‌ సరస్సులో కీలకమైన ఫింగర్‌ 4కు వ్యతిరేక దిశలో ఉంటాయి. దీంతో ఈ శిఖరాలపై నుంచి స్పంగూర్‌ సరస్సు.. చుట్టుపక్కల మైదాన ప్రాంతాలు భారత్‌ గురిలోకి వస్తాయి. డ్రాగన్‌ దళాలు భారత్‌ భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడి నుంచి ముందే గుర్తించవచ్చు. దీంతో భవిష్యత్తులో భారత భూభాగాలను ఆక్రమించుకోవడం కష్టమవడంతో ఒడ్డునపడ్డ చేప వలే అది కొట్టుకుంటోంది. దీనికి తోడు భారత్‌ కూడా చైనాకు సమాన సంఖ్యలో ఆయుధాలు, బలగాలను మోహరిస్తుండటంతో డ్రాగన్‌ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని