Terrorism in pakistan: పెంచిన పాకిస్థాన్‌నే కాటేస్తున్న ఉగ్ర సర్పం!

పామును పెంచి పోషిస్తే అది తననే కాటేస్తుంది అన్న నానుడి పాకిస్థాన్‌ను అతికినట్లు సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్‌.. ఇప్పుడు ఆ ఉగ్రదాడికే బలవుతోంది.....

Published : 29 Sep 2021 02:11 IST

ఒక్క నెలలోనే నాలుగేళ్ల గరిష్ఠానికి ఉగ్రదాడులు

దిల్లీ: పామును పెంచి పోషిస్తే అది తననే కాటేస్తుంది అన్న నానుడి పాకిస్థాన్‌ను అతికినట్లు సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్‌.. ఇప్పుడు ఆ ఉగ్రదాడికే బలవుతోంది. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. పాకిస్థానీ తాలిబన్లుగా పిలిచే టీటీపీ ఉగ్రసంస్థ ఆ దేశంలో దాడులను ఉద్ధృతం చేసింది.

ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా వాడుకుంటే దానితో వారికే ముప్పు పొంచి ఉందని పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస వేదికగా చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమవుతున్నాయి. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నపటినుంచి పాక్‌లో ఉగ్రదాడులు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్‌ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఒక్క ఆగస్టు నెలలోనే దాయాది దేశంలో 35 ఉగ్ర దాడులు జరిగాయి. వీటిలో 52మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2017 ఫిబ్రవరి తర్వాత ఒక్క నెలలో ఈ స్థాయిలో పాక్‌లో ఉగ్ర దాడులు జరగడం ఇదే తొలిసారి.

ఈ ఉగ్రదాడుల్లో ఎక్కువగా తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) సంస్థ హస్తం ఉంది. ఈ సంస్థను పాకిస్థాన్‌ తాలిబన్లుగా అభివర్ణిస్తారు. అల్‌ఖైదా సహా ఇతర ఉగ్రవాద సంస్థలతో దీనికి సంబంధం ఉంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం టీటీపీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. సాయుధ పోరాటం ద్వారా పాకిస్థాన్‌లో అధికారంలోకి రావాలని భావిస్తోన్న ఈ సంస్థ.. దాడులతో దాయాది దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అఫ్గాన్‌లో పుంజుకోవడానికి తాలిబన్లకు పాక్‌ అన్ని విధాలా అండగా నిలిచింది. అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించింది. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటులో కూడా జోక్యం చేసుకుంది. అయితే పాముకు పాలుపోసి పెంచితే ఏం జరుగుతుందో ఇప్పుడిప్పుడే దాయాది దేశానికి తెలిసివస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అఫ్గాన్‌ జైళ్ల నుంచి తాలిబన్లు విడిచిపెట్టారు. మరోవైపు తాలిబన్లు సాధించిన విజయం స్ఫూర్తితో పాకిస్థానీ తాలిబన్‌ సంస్థ పాక్‌లో ఉగ్రదాడులను ఉద్ధృతం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని