Air India: ఇంటర్నెట్‌లో చూశా.. రూ.25 వేలు కట్టను.. : ప్రయాణికుడి వాదన!

ఇటీవల ఎయిర్‌ ఇండియా విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా.. అతడు నిరాకరించడం గమనార్హం. బెయిల్‌ మొత్తం రూ.25 వేలు తాను చెల్లించనని, ఈ కేసులో జరిమానా కేవలం రూ.250గా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చదివానని అతడు వాదించాడు.

Updated : 14 Mar 2023 13:53 IST

ముంబయి: ఇటీవల ఎయిర్‌ ఇండియా(Air India) విమానంలో ఓ వ్యక్తి సిగరెట్‌ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అనుచిత ప్రవర్తన(Unruly Behaviour)తో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని.. కాళ్లు, చేతులు కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. అనంతరం విమానయాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసినా.. తన ‘ఇంటర్నెట్‌’ వాదనతో దాన్ని నిరాకరించి, జైలుకే వెళ్తానని చెప్పడం గమనార్హం. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.

భారత సంతతికి చెందిన రత్నాకర్‌ ద్వివేది(37) ఇటీవల లండన్‌ నుంచి ముంబయికి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించాడు. విమానంలోని బాత్రూంకి వెళ్లి పొగ తాగుతుండగా.. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో అరవడం మొదలుపెట్టిన అతడు.. అంతటితో ఆగకుండా విమాన డోర్‌ను తెరిచేందుకు యత్నించాడు. అతడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అతడి కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలోనే కూర్చునేలా చేశామని విమాన సిబ్బంది వెల్లడించారు.

ముంబయి చేరుకున్న వెంటనే అతడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి అప్పజెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ఐపీసీతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 1937లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్ మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. ఇంటర్నెట్‌లో వెతికితే సంబంధిత సెక్షన్‌ కింద రూ.250 మాత్రమే జరిమానాగా ఉందని, అంతే చెల్లిస్తానని వాదించాడు. కావాలంటే.. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని