Amarnath Yatra: మూడేళ్ల విరామం అనంతరం.. అమర్‌నాథ్‌ యాత్రకు సర్వం సిద్ధం

జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) మొదలవుతుందని శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు (SASB) ప్రకటించింది.

Published : 27 Jun 2022 23:07 IST

జూన్‌ 30 నుంచి 43 రోజులపాటు శివలింగ దర్శనం

శ్రీనగర్‌: హిమాలయ మంచుకొండల్లో (Himalayas) ప్రతిఏటా వెలిసే పరమశివుడి మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) మొదలవుతుందని శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు (SASB) ప్రకటించింది. జూన్‌ 30వ తేదీ నుంచి 43 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర రక్షాబంధన్‌ రోజున (ఆగస్టు 11) ముగియనున్నట్లు పేర్కొంది. పహల్గామ్‌, బల్తాల్‌ మార్గాల్లో ప్రయాణం సాఫీగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లతోపాటు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా యాత్రకు రాలేని భక్తులకు ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం, పూజ, ప్రసాదాలను పొందవచ్చని ఎస్‌ఏఎస్‌బీ వెల్లడించింది.

మరోవైపు యాత్రలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించేందుకు 70 పడకల ఆస్పత్రిని బల్తాల్‌ బేస్‌ క్యాంపు వద్ద ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, ఆక్సిజన్‌ వార్డులు, ఐసీయూ, ఫార్మసీ, ల్యాబ్‌ల సౌకర్యాలు ఉన్నాయన్నారు. బల్తాల్‌ చాందన్వారీ మార్గాల్లో 135 అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఈసారి ‘స్వచ్ఛ అమర్‌నాథ్‌ యాత్ర’ లక్ష్యంగా పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరిస్తామని యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు.

గత రెండు, మూడేళ్లుగా అమర్‌నాథ్‌ యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. ఆర్టికల్‌ 370 రద్దుతో 2019లో అమర్‌నాథ్‌ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. అనంతరం దేశంలో కొవిడ్‌ విస్తృతి పెరగడంతో 2020, 2021ల్లోనూ యాత్ర చేపట్టలేదు. ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతి నియంత్రణలో ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూడేళ్ల విరామం తర్వాత యాత్ర మొదలు కానుండడంతో భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమర్‌నాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ యాత్ర జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు