Abortion: పెళ్లితో సంబంధం లేదు.. మహిళలందరికీ అబార్షన్‌ చేయించుకునే హక్కుంది..!

మహిళల గర్భవిచ్ఛిత్తిలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితమైన అబార్షన్లు చేయించుకునే

Updated : 29 Sep 2022 14:01 IST

గర్భవిచ్ఛిత్తిపై  సుప్రీంకోర్టు కీలక తీర్పు

దిల్లీ: మహిళల గర్భవిచ్ఛిత్తిలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భవిచ్ఛిత్తి చేయించుకునే హక్కుంది. మహిళ వైవాహిక స్థితి కారణంగా ఆమెకు అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. మెడికల్‌ టర్మినేషన్ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరం.. రాజ్యాంగం ఎదుట అది నిలవజాలదు. పెళ్లయిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదు. ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి’’ అని కోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారం కూడా రేప్‌ వంటిదే..

విచారణ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాల’ను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ‘‘అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక. చట్టపరమైన భాగస్వామి(భర్త)తోనూ లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయికతోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చొచ్చు. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందే లెక్క. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన ఆవశ్యతక ఉంది’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎంటీపీ చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోన్న ‘వైవాహిక అత్యాచార’ కేసుల్లో తీర్పులకు ఈ వ్యాఖ్యలు ఓ మార్గం చూపించే అవకాశముంది.

ఎంటీపీ చట్టం ప్రకారం అత్యాచార బాధితులు, మైనర్లు, వివాహితులు, మానసిక సమస్యలతో ఉన్నవారు, పిండం సరిగ్గా అభివృద్ధి చెందని ఘటనల్లో మహిళలు 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేయించుకునేందుకు అనుమతి ఉంది. అవివాహితులు తమ సమ్మతితో గర్భం దాలిస్తే.. అప్పుడు 20 వారాల వరకు మాత్రమే అబార్షన్‌ చేయించుకునే వీలుంది. తాజా తీర్పుతో ఇప్పుడు పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ గర్భం దాల్చిన 24 వారాలలోపు గర్భవిచ్ఛిత్తి చేయించుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని