వాయుసేన తలనొప్పికి తేజస్‌ మందు..!

వైమానిక దళానికి ప్రభుత్వం మళ్లీ కొత్త రక్తం ఎక్కిస్తోంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే1ఏ రకం కొనుగోలుకు నిన్న కేబినెట్‌ కమిటీ ఆమోదముద్రవేసింది.

Published : 15 Jan 2021 03:46 IST

 ఈ విమానం ప్రత్యేకం.. ఎందుకంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వైమానిక దళానికి ప్రభుత్వం మళ్లీ కొత్త రక్తం ఎక్కిస్తోంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే1ఏ రకం కొనుగోలుకు నిన్న కేబినెట్‌ కమిటీ ఆమోదముద్రవేసింది. దీంతో మరో 83 విమానాలు మరికొన్నేళ్లలో భారత్‌ అమ్ములపొదిలో చేరనున్నాయి. వాస్తవానికి 35ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రాజెక్టు.. ఉత్పత్తి మందకొడిగా ఉంది.. విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ..  ఇలా తేజస్‌పై పలు విమర్శలు వచ్చాయి. కానీ, ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎల్‌సీఏ(తేలికపాటి యుద్ధవిమానం) విభాగంలో తేజస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైందని చెబుతారు.

వాయుసేనకు యుద్ధవిమానాల కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి వాయుసేన అవసరాలు తీర్చాలంటే  ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్‌లు ఉండాలి. కానీ, కాలం చెల్లిన మిగ్‌ల తొలగింపు.. విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. 18 విమానాల జట్టును స్క్వాడ్రన్‌గా భావిస్తారు. ఇప్పుడు తాజా మరో 83 తేజస్‌ విమానాలు 2026నాటికి వాయసేనలో చేరనున్నాయి. తొలి విమానం 2022లో చేతికి అందగా.. ఈ మోడల్‌ తొలి స్క్వాడ్రన్‌ 2024లో పూర్తికానుంది. 

అసలు ఎల్‌సీఏ ఎంకే1ఏ ఏమిటీ..?

తొలితరం తేజస్‌తో పోలిస్తే ఎంకే1ఏ రకంలో చాలా మార్పులు చేయనున్నారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్‌ ఎంకే1(ఎఫ్‌వోసీ)కి ఇది అడ్వాన్స్ మోడల్‌. దీనిలో క్వాడ్రప్లక్స్‌ డిజిటల్‌ ఫ్లైబైవైర్‌ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఇది 3,500 కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇది సూపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణించగలదు. 
 70కి పైగా దేశీయ సంస్థల నుంచి..

తేజస్‌ ఏంకే1ఏలో దేశీయ పరికరాలు 50శాతం నుంచి 60శాతానికి చేర్చనున్నారు. లార్సన్‌ అండ్‌ టుబ్రో, డైనమాటిక్‌ టెక్నాలజీస్‌, ఆల్ఫాడిజైన్‌ వంటి 70కిపైగా ప్రముఖ సంస్థలు దీనిలో తయారీలో భాగస్వాములు. అంతేకాదు  ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెచ్‌ఏఎల్‌ నాసిక్‌, బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యునిట్లను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం హాల్‌లో  ఏడాదికి 8 విమానాలను మాత్రమే తయారు చేస్తున్నారు. దీనిని 16 విమానాల స్థాయికి తీసుకెళ్లనున్నారు.  ఇక్కడ అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం కూడా రూ.1200 కోట్లను మంజూరు చేసింది. దీంతోపాటు వచ్చే సరికొత్త  విమానాల కోసం బేసుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  

విదేశీ బెదిరింపులకు కొంత అడ్డుకట్ట..

సగానికి పైగా దేశీయ పరికరాలనే వినియోగంచడంతో ఈ విమానాల నిర్వహణ సులువుగా మారనుంది. గతంలో విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి వచ్చేది. కీలక యుద్ధసమయాల్లో విదేశాలు విడిభాగాలు సరఫరాలను నిలిపేసిన సంఘటనలను వాయుసేన చవిచూసింది. ఇప్పుడు ఈ బాధ కొంత తప్పుతుంది.  

యుద్ధవిమానాలను పూర్తిస్థాయి ఫీచర్లతో ఏ దేశం మరో దేశానికి విక్రయించదు. కేవలం ఎగుమతుల కోసం తయారు చేసిన మోడల్‌ను మాత్రమే విక్రయిస్తుంది. అంటే వాస్తవిక మోడల్‌ కంటే కొంత సామర్థ్యం తగ్గుతుందన్నమాట.  దేశీయ యుద్ధవిమానాలతో ఈ సమస్య తప్పుతుంది. 

ప్రత్యేక రాడార్‌తో 16లక్ష్యాలు ఒకేసారి..

సరికొత్త తేజస్‌ విమానాల్లో యాక్టివ్‌ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్‌ యారే (ఏఈఎస్‌ఏ) రాడార్లను వినియోగించనున్నారు. ఇవి అత్యాధునికమైనవి. శత్రుదేశాల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకొని పని చేస్తుంది. దీంతోపాటు శత్రుదేశాల రాడార్ వార్నింగ్‌ రిసీవర్లు వీటిని అడ్డుకోవడం కష్టం. దీంతోపాటు వివిధ మోడల్‌లలో కూడా పనిచేస్తుంది. రియల్‌బీమ్‌ మ్యాపింగ్‌, భూమిపై కదిలే లక్ష్యాలను గుర్తించడం, గగనతలంలో వచ్చే ముప్పులను గుర్తించడం వంటివి చేస్తుంది. ఇది ఏకకాలంలో పలు లక్ష్యాలను గుర్తించగలదు. మొత్తం 16 లక్ష్యాలను గుర్తిస్తుంది. 

ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ సూట్‌..

శత్రదేశాల గగనతలంలోకి ప్రవేశించాక యుద్ధవిమానాలను పలు రకాల సిగ్నల్స్‌.. తరంగాలు వేటాడుతాయి. ఇవి విమానం జాడను పసిగట్టేందుకు.. విమానంలో కమ్యూనికేషన్ల వ్యవస్థను జామ్‌ చేసేందుకు ప్రయత్నిస్తాయి. వీటి కన్నుగప్పుతూ ముందుకెళ్లేందుకు ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ సూట్‌ ఉపయోగపడుతుంది. ముప్పును గమనించి ముందే వాటిని జామ్‌ చేయడం వంటి చేయవచ్చు. ఈ విమానం బయటప జామింగ్‌పాడ్‌ అమర్చడం మరింత కలిసొచ్చే అంశం. 

కంటికి కనిపించని శత్రువుతో పోరాటం..

యుద్ధవిమానాలు కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన గన్స్‌తో, క్షిపణులతో పరస్పరం తలపడితే దానిని డాగ్‌ఫైట్‌గా అభివర్ణిస్తారు. ఆధునిక యుద్ధతంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదు. శత్రువు మనల్ని చూడకముందే.. గుర్తించి దాడిచేస్తాయి. ఇందుకోసం శక్తివంతమైన రాడార్లు.. బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ (బీవీఆర్‌) క్షిపణులను వినియోగిస్తారు. తేజస్‌ ఎల్‌సీఏ1ఏలో  డెర్బీ క్షిపణని వాడవచ్చు. దీంతోపాటు అస్త్రమాక్‌-1 బీవీఆర్‌ మిసైల్‌ను కూడా ఇందో వినియోగించే వీలుంది. పాక్‌ వినియోగించే జే-17లోని బీవీఆర్‌ క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది. 

ఇదీ చదవండి

భారత వాయుసేనకు తేజస్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని