Covishield: రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన

కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించింది. దీంతో సెకండ్‌ డోసు కోసం ఆస్పత్రులకు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొడిగింపు నిర్ణయం...

Published : 17 May 2021 01:33 IST

దిల్లీ: కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించింది. దీంతో సెకండ్‌ డోసు కోసం ఆస్పత్రులకు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొడిగింపు నిర్ణయం ప్రకారం గడువు పూర్తికాని వారిని వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద తిప్పి పంపుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో   కేంద్రం ఆదివారం కీలక ప్రకటన చేసింది. రెండో డోసు కోసం ఇది వరకే అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. కొవిన్‌ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్‌ రద్దు చేయలేదని పేర్కొంది. కొత్తగా రెండోడోసు కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకునేవారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఆ మేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు పేర్కొంది.

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సూచనల మేరకు కొవిషీల్డ్‌ రెండో డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు కేంద్రం మే 13న పొడిగించింది. ఈ నేపథ్యంలో రెండో డోసుకు వెళ్తున్న వారిని అక్కడి సిబ్బంది తిప్పి పంపుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే తీసుకున్న అపాయింట్‌మెంట్లు చెల్లుతాయని, వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ఎవర్నీ తిప్పి పంపొద్దని కేంద్రం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఆ మేరకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అలాగే వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునేవారు సైతం మొదటి డోసుకు వేసుకున్న 84 రోజుల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకునేలా రీషెడ్యూల్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని