Mohammed Zubair: జర్నలిస్ట్‌ జుబైర్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ

ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్​న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్​కు న్యాయస్థానం మరో నాలుగు రోజుల రిమాండ్ విధించింది........

Published : 29 Jun 2022 01:59 IST

దిల్లీ: మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై అరెస్టయిన ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్​న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబైర్​కు (Mohammed Zubair) న్యాయస్థానం మరో నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ఒకరోజు కస్టోడియల్ విచారణ ముగిసిన నేపథ్యంలో జుబైర్‌ను మంగళవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు దిల్లీ పోలీసులు హాజరుపర్చారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరగా.. కోర్టు నాలుగు రోజుల పాటు రిమాండ్​ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై జుబైర్‌ను దిల్లీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ట్విటర్‌ వినియోగదారుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు జుబైర్‌పై భారత శిక్షాస్మృతిలోని 153ఎ (మతం, జాతి, జన్మస్థలం, భాష వంటివాటి ఆధారంగా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), 295ఎ (ఉద్దేశపూర్వక దుశ్చర్య ద్వారా మతపరమైన భావాలను దెబ్బతీయడం) సెక్షన్ల కింద ఇటీవల కేసు నమోదైంది.

జుబైర్‌ అరెస్టును కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా తప్పుపట్టారు. భాజపా ద్వేషం, మత దురభిమానం, అబద్ధాలను బయటపెట్టేవారందరినీ ఆ పార్టీ శత్రువులుగానే చూస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. జుబైర్ అరెస్టును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) సైతం నేడు ఖండించారు. ‘జుబైర్​ను, తీస్తా సీతల్వాద్​ను ఎందుకు అరెస్టు చేశారు? వారు చేసిన తప్పేంటి? నిజం మాట్లాడటం.. నిజాన్ని గుర్తించి చెప్పడమే నేరమా? భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారందరినీ వేధింపులకు గురిచేస్తున్నారు. విద్వేష ప్రసంగాలు చేసినవారు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని