Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్‌కు పాక్‌, సిరియా నుంచి విరాళాలు..!

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై అరెస్టయిన ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు జుబైర్‌ కేసులో దిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆల్ట్‌ న్యూస్‌ కార్యకలాపాలను

Published : 02 Jul 2022 16:20 IST

కీలక విషయాలు వెల్లడించిన దిల్లీ పోలీసులు

దిల్లీ: మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై అరెస్టయిన ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు జుబైర్‌ కేసులో దిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆల్ట్‌ న్యూస్‌ కార్యకలాపాలను నిర్వహించే ప్రావ్దా మీడియాకు పాక్‌, సిరియా, ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి విరాళాలు వచ్చినట్లు తెలిపింది. అంతేగాక, ఈ కేసుకు సంబంధించిన అనేక సాక్ష్యాలను ఆయన ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

మతపరంగా వ్యక్తుల భావోద్వేగాలను దెబ్బతీసేలా గతంలో ట్వీట్ చేసినందుకు గానూ జుబైర్‌ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అతడిని నేడు దిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా దిల్లీ పోలీసులు కీలక ఆరోపణలు చేశారు. ప్రావ్దా మీడియాకు జుబైల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు పాకిస్థాన్‌, సిరియా, దుబాయి, షార్జా, సింగపూర్‌, అబుదాబీతో పాటు పలు అమెరికా రాష్ట్రాల నుంచి రూ.2లక్షలకు పైగా విరాళాలు అందినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, జుబైర్‌ అరెస్టు తర్వాత అతడికి మద్దతుగా అనేక మంది ట్వీట్లు చేశారని, అయితే ఆ ఖాతాలు కూడా విదేశాలకు చెందినవే అని పేర్కొన్నారు. ‘‘ఇది కేవలం ఒక ట్వీట్‌కు సంబంధించిన కేసు మాత్రమే కాదు. అతను సాక్ష్యాలు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నాడు. కీలక వివరాలను డిలీట్‌ చేశాడు. అతడికిపై కుట్ర కేసు కూడా నమోదు చేశాం’’ అని పోలీసులు కోర్టుకు తెలిపారు.

బెయిల్‌ నిరాకరణ..

కేసు తీవ్రత దృష్ట్యా అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జుబైర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అతడిని మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని