Amarinder Singh: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌..?

భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో అధికార పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌

Updated : 02 Jul 2022 13:49 IST

దిల్లీ: భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో అధికార పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

ప్రస్తుతం అమరీందర్‌ సింగ్‌ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్‌ వెళ్లారు. గత ఆదివారం ఆపరేషన్‌ పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ.. కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం. లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత కెప్టెన్‌ తన ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)’ పార్టీని భాజపాలో విలీనం చేయనన్నట్లు నిన్న పలు మీడియా ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మోదీతో అమరీందర్‌ మంతనాలు జరిపినట్లు సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్‌. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్‌ కూడా ఓటమిపాలవ్వడం గమనార్హం.

కాగా.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నారు. జులై 5 నుంచి జులై 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పోలింగ్‌ తేదీ రోజునే ఫలితాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని