జీనోమ్‌ టెస్టులను పెంచండి

గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలలుగా తగ్గుతున్న కరోనా, మరణాలు ఉన్నట్టుండి పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 23 Feb 2021 22:37 IST

కేంద్రానికి నిపుణుల సూచన

దిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలలుగా తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు ఉన్నట్టుండి పెరగడంపై ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల్లో కొత్త రకం కరోనా వేరియంట్లు బయటపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తాజాగా వెలుగుచూస్తున్న వేరియంట్లు త్వరగా వ్యాపించే లక్షణాన్ని కలిగి ఉండటంతో ప్రభుత్వం జీనోమ్‌ పరీక్షలను పెంచాలని సూచించారు.

ఇప్పటికే మహారాష్ట్ర, కేరళలోని కొన్ని వందల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపామని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కొత్త రకం వైరస్‌ వ్యాపించిందా.. లేదా అన్న విషయం కొద్ది రోజుల్లో తెలుస్తుందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 6వేల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపామన్నారు. కేరళ, మహారాష్ట్రలలో పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని, వాటిని పెంచాలని వైద్యాధికారులు కోరారు. ‘‘ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఇతర దేశాల్లో వెలుగుచూసిన వేరియంట్లు కారణమా.. లేదా మన దేశంలోనే కొత్త వేరియంట్ తలెత్తిందా అన్నది అసలు సవాలు. వీటిని గుర్తించేందుకు త్వరితంగా జీనోమ్‌ టెస్టులు చేయాలి.’’ అని ఐసీఎంఆర్‌ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి తెలిపారు.

కాగా భారత్‌లో యూకే రకం కరోనా కేసులు 187 నమోదవ్వగా, దక్షిణాఫ్రికా కరోనా రకం కేసులు 4, బ్రెజిల్‌ రకం కేసు 1 నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని