Covid: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. గుజరాత్‌ అప్రమత్తం

చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చిన ఓ గుజరాత్‌ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Published : 23 Dec 2022 01:42 IST

గాంధీనగర్‌: చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్‌ (Omicron) కొత్తరకం వేరియంట్‌ కేసులు మన దేశంలోనూ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను ముమ్మరం చేసింది. ఇదే సమయంలో విదేశాల నుంచి గుజరాత్‌ వచ్చిన ఇద్దరికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒకరు చైనా నుంచి ఒకరు భావ్‌నగర్‌కు రాగా మరొకరు ఆస్ట్రేలియా నుంచి రాజ్‌కోట్‌కు చెందిన మహిళ ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. బాధితుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటివరకు దేశంలో నాలుగు బీఎఫ్‌.7 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గుజరాత్‌ భావ్‌నగర్‌కు చెందిన వ్యాపారి (34) ఇటీవల చైనాలో పర్యటించాడు. పనులు ముగించుకున్న ఆయన డిసెంబర్‌ 19న భావ్‌నగర్‌కు చేరుకున్నాడు. అనంతరం అతడికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించిన అధికారులు.. అతడిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజ్‌కోట్‌ మహిళకూ కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే, ఆమె మూడు డోసుల టీకా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఆమె నమూనాలను జీనోమ్‌ పరీక్షకు పంపించినట్లు తెలిపారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు బీఎఫ్‌.7 కేసులు నమోదైనట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్‌ పటేల్‌ వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరితోపాటు వడోదరకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అయితే, ఆ ముగ్గురూ ఇప్పటికే కోలుకున్నారని.. ప్రస్తుతం ఆ వేరియంట్‌కు చెందిన క్రియాశీల కేసులు రాష్ట్రంలో లేవని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

మరోవైపు చైనా నుంచి వచ్చిన వ్యక్తి వైరస్‌ బారినపడటంతో స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ టెస్టులను పెంచడంతో పాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విదేశాల నుంచి తిరిగి వచ్చే వారికి తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి అధికారులకు సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని