భారత్‌ ‘పవర్’‌పై డ్రాగన్‌ గురి!

సరిహద్దు విషయంలో భారత్‌తో యుద్ధానికి కాలుదువ్విన చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పు లద్దాఖ్‌ ఉద్రిక్తతలతో గతేడాది రెండు దేశాల మధ్య నెలలపాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

Updated : 01 Mar 2021 14:52 IST

ముంబయిలో గ్రిడ్‌ వైఫల్యం వెనుక చైనా హ్యాకర్లు

తాజా అధ్యయనం వెల్లడి

దిల్లీ: సరిహద్దు విషయంలో భారత్‌తో యుద్ధానికి కాలుదువ్విన చైనా కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలతో గతేడాది రెండు దేశాల మధ్య నెలలపాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో డ్రాగన్‌.. మన దేశ విద్యుత్తు‌ రంగంపై గురిపెట్టినట్లు తాజాగా తెలిసింది. భారత ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, లోడ్‌ డిస్పాచ్‌‌ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ తమ అధ్యయనంలో వెల్లడించింది. గతేడాది అక్టోబరులో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భారీ పవర్‌కట్‌ వెనుక డ్రాగన్‌ హస్తం ఉండొచ్చని.. ఇది భారత్‌కు హెచ్చరికేనని పేర్కొంది. 

గతేడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా జవాన్ల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగు నెలలకు అక్టోబరు 12న  ముంబయిలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కరెంట్‌ కట్‌కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ‘ముంబయి పవర్‌కట్‌’తో హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది. 

చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్‌ఎకో గ్రూప్‌ అనే సంస్థ భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్లు, విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్‌ సిస్టమ్స్‌లోకి సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను చొప్పించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్‌ డిస్పాచ్‌‌‌ సెంటర్‌లో ఈ మాల్‌వేర్‌ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్‌ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్‌ పరికరాల్లో మాల్‌వేర్‌ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్‌ విఫలం కావడం గమనార్హం.  

విద్యుత్తు, టెలికాం రంగంలో కీలక వనరుల కోసం భారత్‌ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా చైనా పరికరాలనే వినియోగిస్తున్నారు. భారత్‌లో వినియోగించే రూటర్లు అత్యధికం అక్కడి నుంచే వస్తున్నాయి. దీంతో ఈ రంగాలు చైనా హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయి. భారత బ్యాంకింగ్‌ వెబ్‌సైట్లు, డేటా రిపోజిటర్లు తరచూ డ్రాగన్‌ హ్యాకర్ల దాడికి గురవుతూనే ఉన్నాయి. 2012లో సైబర్‌ దాడి కారణంగా నేషనల్‌ పవర్‌గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన తర్వాత భారత్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విద్యుత్‌ రంగంలో చైనా పరికరాలను పూర్తిగా నిషేధించాలని 2015లో ఇండియన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ను కోరింది. 

కాగా.. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్‌, చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ అధ్యయనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని