ప్రతిదీ బయటకు చెప్పలేం కదా!: అమిత్‌ షా

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడిన వేళ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి..

Published : 29 Mar 2021 01:26 IST

దిల్లీ: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడిన వేళ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాలేదు. అయితే, ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో ‘ప్రతిదీ బయటకు చెప్పలేం’ కదా అని బదులిచ్చారు. భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ ధ్రువీకరించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్‌, ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత అహ్మదాబాద్‌లో శనివారం అమిత్‌షాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజీనామాకు ఓ వైపు మహారాష్ట్రలోని ప్రతిపక్ష భాజపా పట్టుబడుతున్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో రెండు పార్టీలకు చెందిన నేతలే పాల్గొన్నారా? వేరే ఇంకెవరైనా పాల్గొన్నారా? ఇంతకీ ఏం చర్చించారు? అనే దానిపై సమాచారం లేదు. మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ‘సామ్నా’ పత్రికలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారన్నారు. అయినా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటని ప్రశ్నించారు. రౌత్‌ వ్యాఖ్యలు, పవార్‌ రహస్య భేటీ పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు రక్తికట్టించేలా కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు