Amritpal Singh: అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్‌.. జార్జియాలో శిక్షణ..!

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ చరిత్ర తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అతడు ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Updated : 20 Mar 2023 12:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడు నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత కోసం భద్రతా దళాలు పంజాబ్‌ను జల్లెడ పడుతున్నాయి. గతంలో  చాలా కాలం దుబాయ్‌లో ఉన్న అమృత్‌పాల్‌కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐతో పరిచయాలు ఏర్పడ్డాయి. అతడిని ఆ సంస్థ పావుగా వాడుకొని పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి పథకం పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయని ఓ ఆంగ్లవార్త సంస్థ కథనంలో పేర్కొంది.

ఐఎస్‌ఐ ఏజెంట్లతో  పరిచయాలు

అమృత్‌పాల్‌ 2012లో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేందుకు దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్‌ నేత లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే సోదరుడు జస్వంత్‌, ఉగ్రవాది పరమ్‌జీత్‌ సింగ్‌ పమ్మాతో పరిచయం ఏర్పడింది.  దుబాయ్‌లో అతడికి ఐఎస్‌ఐ బ్రెయిన్ వాష్‌ చేసింది. ఆ తర్వాత భారత్‌ చేరుకోవడానికి ముందు అమృత్‌పాల్‌ జార్జియాకు వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి అక్కడే ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. అతడు పంజాబ్‌లో అశాంతి రేపడానికి పక్కా వ్యూహాంతోనే దేశంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత చాలా వేగంగా ‘వారిస్‌ పంజాబ్‌ దే’ను హైజాక్‌ చేశాడు. అక్కడి నుంచి అమృత్‌పాల్ మెరుపువేగంతో ఎదిగాడు. దీంతోపాటు సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థతో కూడా అతడికి సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి తరచూ పంజాబ్‌లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చినట్లు అనుమానాలు ఉన్నాయి. అమృత్‌పాల్‌కు యూకేలో ఉంటున్న అవతార్‌ సింగ్‌ ఖండా ప్రధాన హ్యాండిలర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అవతార్‌ సింగ్‌, పమ్మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్‌పాల్‌ ఎదుగుదల వెనుక అవతార్‌ ప్లాన్లు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అమృత్‌పాల్‌ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. యాక్టర్‌ దీప్‌సిద్ధూ మరణంతో  అమృత్‌పాల్‌ జీవితమే మారిపోయింది.  ‘వారిస్‌ పంజాబ్‌ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు.

ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌ ఏర్పాటు..?  

అమృత్‌పాల్‌ సొంతగా ఓ ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌ (ఏకేఎఫ్‌)గా దీనికి పేరుపెట్టారు. ఈ పేరుతో ఉన్న జాకెట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. జల్లూపూర్‌ ఖేడా గ్రామంలోని అమృత్‌పాల్‌ ఇంటిపై ఏకేఎఫ్‌ అని రాసి ఉండటాన్ని దళాలు గుర్తించాయి. దీనికి తోడు నిన్న అమృత్‌పాల్‌ వాహనం నుంచి తూటాలు, తుపాకులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దళం సహకారంతోనే అజ్‌నాలా స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

రివర్స్ మైగ్రేషన్‌ను ప్రోత్సహించేందుకు భార్యను ఇక్కడే ఉంచి..?

కిరణ్‌దీప్‌ కౌర్‌ యూకేకు చెందిన ఎన్నారై. వారి స్వస్థలం జలంధర్‌. ఆమెను 29 ఏళ్ల అమృత్‌పాల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొన్నాడు. ఈ పెళ్లి అమృత్‌పాల్‌ పూర్వీకుల గ్రామమైన జల్లూపూర్‌ ఖేడాలో జరిగింది. పెళ్లి తర్వాత భార్యను తనతోనే ఉండిపోవాలని అమృత్‌పాల్‌ కోరాడు. ఇది విదేశాల నుంచి పంజాబీల రివర్స్‌ మైగ్రేషన్‌ను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని అతడు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. 

కెనడా వీసాకు అమృత్‌పాల్‌ భార్య దరఖాస్తు..

అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో అమృత్‌పాల్‌ కూడా నేపాల్‌ మీదుగా కెనడాకు పారిపోయేందకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని జలంధర్‌ డీఐజీ స్వపన్‌ శర్మ ధ్రువీకరించారు. 

బీఎస్‌ఎఫ్‌ను అప్రమత్తం చేసిన కేంద్రం..

దేశ సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్ఠం చేయాలని కేంద్ర హోంశాఖ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్ఎఫ్‌), సశస్త్రసీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)ను ఆదేశించింది. అమృత్‌పాల్‌ నేపాల్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దులు దాటే అవకాశం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని