Amritpal Singh: అశ్లీల సందేశాలు.. పాక్‌ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్‌ నేరాల చిట్టా..!

Amritpal Singh: అమృత్‌పాల్‌ కోసం వేట తీవ్రమైంది. అతడు పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకొన్నట్లు గుర్తించారు. మరోవైపు అతడి ఖలిస్థాన్‌ బ్లూప్రింట్‌ను ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. 

Updated : 23 Mar 2023 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు. అలాగే అతడి గత చరిత్రను మొత్తం తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తరచూ ఖలిస్థాన్‌ గురించి మాట్లాడే అమృత్‌పాల్‌(Amritpal Singh)కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్‌లు, వాయిస్‌నోట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్‌ నోట్‌లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటిల్లో మహిళలతో టైంపాస్‌ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది. తాజాగా అమృత్‌పాల్‌ తన బైకును మరో వాహనంపై పెట్టి ప్రయాణిస్తున్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతడి భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలు..

అమృత్‌పాల్‌ పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి ఆంగ్లవార్తా సంస్థ ‘ఎన్డీటీవీ’కి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్‌లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) పాక్‌  ఐఎస్‌ఐ సాయంతో తెప్పించిన ఆయుధాలను డీఅడిక్షన్‌ సెంటర్లు, జల్‌పూర్‌ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు. 

సేకరించిన సొమ్ముకు లెక్కాపత్రం లేదు..

‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ ఆధ్వర్యంలో ఖల్సా వాహీర్‌ వంటి కార్యక్రమం నిర్వహించి సేకరించిన మొత్తానికి అమృత్‌పాల్‌ వద్ద ఎటువంటి లెక్కాపత్రం లేదు. ఖలిస్థాన్‌ పేరిట సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని అధికారవర్గాలు చెప్పాయి. ఆ సొమ్ముతో ఖరీదైన వాహన కాన్వాయ్‌ల్లో తిరిగినట్లు వెల్లడించారు. 

ఇతర రాష్ట్రాల వారిపై అసహనం పెంచడం..

పంజాబ్‌ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడం అమృత్‌పాల్‌(Amritpal Singh) అజెండాగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ నుంచి పొట్టపోసుకొనే కూలీలపై స్థానికంగా వ్యతిరేకత పెంచేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందర్‌పూర్‌ ఖల్సా ఫౌజీ సాయంతో ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి టెన్షన్లు పుట్టించాలన్నది అమృత్‌పాల్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతోపాటు పంజాబ్‌ యువతలో తుపాకీ సంస్కృతిని పెంచేందుకు అమృత్‌పాల్‌ ప్రయత్నించాడు. దీనికి గురువుల బోధనలను వక్రీకరించేందుకు యత్నించాడు. 

మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం..

అమృత్‌పాల్‌ వేట ఇప్పుడు మహారాష్ట్రకు కూడా విస్తరించింది. తాజాగా నాందేడ్‌ పోలీసులు అప్రమత్తమైన వాహనాల రాకపోకలపై దృష్టిపెట్టారు. దీంతోపాటు మహారాష్ట్ర ఏటీఎస్‌ పోలీసులు కూడా హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే అమృత్‌పాల్‌కు సంబంధించిన ఏడు రకాల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని