Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా.. తుక్కు బండికి బదులు బొలెరో వాహనం

వ్యాపార దిగ్గజం ఆనంద్​ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు......

Published : 26 Jan 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపార దిగ్గజం ఆనంద్​ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓ వ్యక్తి తయారు చేసిన తుక్కు వాహనాన్ని తీసుకొని.. అందుకు బదులుగా అతనికి ఎస్‌యూవీ బొలెరో వాహనాన్ని కానుకగా ఇచ్చారు.

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్‌ అనే వ్యక్తి స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమారుడికి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్తోమత లేని దత్తాత్రేయ.. తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి సొంతంగా వాహనం తయారుచేశారు. కిక్‌ ఇస్తే స్టార్ట్‌ అయ్యేలా దీన్ని రూపొందించారు. సాధారణంగా ఈ మెకానిజంను బైక్‌లలో చూస్తుంటాం. అంతేకాదు.. దత్తాత్రేయ తయారుచేసిన వాహనంలో స్టీరింగ్‌ ఎడమవైపున ఉండటం విశేషం.

కాగా ఈ వాహనం గురించి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ వీడియో రూపొందించగా.. అది ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వ్యాపార దిగ్గజం.. వారికి అప్పుడే ఈ ఆఫర్‌ ప్రకటించారు. ‘ఇది ఆటోమొబైల్ నిబంధనలను అందుకోవడం లేదని తెలుసు. కానీ, మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారు. దాన్ని నాకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను. ఆయన సృజనాత్మకతను మా మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతాం. అది మాలో స్ఫూర్తి నింపుతుంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మహీంద్రా ఆఫర్‌కు అంగీకరించిన దత్తాత్రేయ తన వాహనాన్ని ఇస్తానని తర్వాత ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యాపార దిగ్గజం.. దత్తాత్రేయ కుటుంబానికి బొలెరో వాహనాన్ని అందించింది. ‘తన వాహనాన్ని ఎక్స్ఛేంజ్‌ చేసుకునే ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఆ కుటుంబం బొలెరోను అందుకుంది. ఆయన సృష్టించిన దానికి గర్విస్తున్నాం. మమ్మల్ని ఉత్తేజపరిచేందుకు ఇది మా రీసెర్చ్ వ్యాలీలోని అన్ని రకాల కార్ల సేకరణలో భాగంగా ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. తన సంస్థ ప్రతినిధులు దత్తాత్రేయ కుటుంబానికి బొలెరోను అందిస్తున్న ఫొటోలను ఆ ట్వీట్‌కు జోడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని